రాజస్థాన్ రాజకీయ క్రీడకు శుభం కార్డు: విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్
గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో ట్విస్టులు ఈ ఎపిసోడ్లో చోటుచేసుకున్నాయి. గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న సచిన్ పైలట్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీలు రంగప్రవేశం చేయడంతో సచిన్ పైలట్ కాస్త మెత్తపడ్డారు.
ఇక శుక్రవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస తీర్మానంను ప్రత్యేక సమావేశం సందర్భంగా ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో కొనసాగుతుందని కూల్చే ప్రయత్నం చేసినప్పటికీ అది జరగని పని అని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
Recommended Video
కర్నాటక, మధ్యప్రదేశ్ గుజరాత్లలో ఎలాంటి రాజకీయాలు చేశారో గుర్తెరగాలని అది రాజస్థాన్లో సాగవని బీజేపీకి చురకలంటించారు గెహ్లాట్. ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారని బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఇక ఓటింగ్ సందర్భంగా మెజార్టీ ఓట్లు గెహ్లాట్ ప్రభుత్వంకు దక్కడంతో విశ్వాస తీర్మానంలో నెగ్గింది.ఇక గెహ్లాట్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించగానే రాజస్థాన్ రాజకీయాలపై వస్తున్న అన్ని వదంతులకు శుభం కార్డు పడినట్లుగా భావించాల్సి ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ చెప్పారు.ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వాస పరీక్షలో మంచి మెజార్టీతో విజయం సాధించిందని సచిన్ పైలట్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షాల పాచికలు పారలేదన్నారు సచిన్ పైలట్. ఇక రాజస్థాన్ సర్కార్పై వస్తున్న వార్తలకు ఊహాగానాలకు ఈ విజయం సమాధానం చెప్పిందని తాను భావిస్తున్నట్లు సచిన్ పైలట్ చెప్పారు. ఇక అన్ని అంశాలపై రోడ్మ్యాప్ తయారు చేస్తున్నామని చెప్పిన సచిన్ పైలట్... తనకు పూర్తి విశ్వాసం ఉందని త్వరలోనే రోడ్ మ్యాప్ విడుదల చేస్తామని చెప్పారు.
ఇక విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా అశోక్ గెహ్లాట్తో పాటు సచిన్ పైలట్ కూడా బీజేపీ ప్రభుత్వంపై శివాలెత్తారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసి విఫలమైందని ధ్వజమెత్తారు. రాజస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కుట్రలు పన్నిందని ఇందులో అమిత్ షా కీలక పాత్ర పోషించారని గెహ్లాట్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీజేపీ షాక్లో ఉందని అన్నారు. ఇక డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతున్నారని..కానీ కుట్ర చేసింది బీజేపీనే అని ధ్వజమెత్తారు గెహ్లాట్. ఇక చర్చ సందర్భంగా మాట్లాడిన సచిన్ పైలట్.. కాంగ్రెస్ పార్టీలో ఉత్పన్నమైన సమస్యలకు పరిష్కారం దొరికిందని ఇప్పుడు అంతా కలిసే ఉన్నామని చెప్పారు. ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న గొడవను పక్కనబెట్టి చర్చలో పాల్గొనాలని అది తమ అంతర్గత వ్యవహారమని పైలట్ కమలం పార్టీకి చురకలంటించారు.