రూ. కోటి లంచం, కోర్టు ముందు అశ్విన్ రావ్
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో జరిగిన అవినీతి కేసులో అరెస్టు అయిన లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ను కోర్టు ముందు హాజరుపరిచారు. కర్ణాటక ప్రభుత్వంలో సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తిని బెదిరించి కోటి లంచం డిమాండ్ చేశారని ఈయన మీద కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ప్రముఖ ముద్దాయి. విచారణకు హాజరుకావాలని ఎస్ఐటి అధికారులు అశ్విన్ రావ్ కు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరుకాకుండ హైదరాబాద్ లో ఉండిపోయారు.
ఎస్ఐటి అధికారులు సోమవారం హైదరాబాద్ లో అశ్విన్ రావ్ ను అరెస్టు చేసి రాత్రి 10.45 గంటల సమయంలో బెంగళూరు తీసుకు వచ్చారు. మంగళవారం అధికారులు అశ్విన్ రావ్ ను లోకాయుక్త న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన ఇంటికి ఎస్ఐటి అధికారులు వచ్చారని, మద్యాహ్నం 1.30 గంటల సమయంలో తనకు నోటీసులు ఇచ్చి విచారణకు బెంగళూరు రావాలని చెప్పి ఇన్నోవా కారులో తీసుకు వచ్చారని అశ్విన్ రావ్ న్యాయమూర్తి ముందు చెప్పాడు.
లోకాయుక్త ను అడ్డం పెట్టుకుని లంచం డిమాండ్ చేశారని నమోదు అయిన కేసు ను వాదించడానికి ప్రత్యేక న్యాయవాదిని నియమించారు. జనార్దన్ అనే న్యాయవాదిని ఈ కేసు కోసం నియమించామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రతులను లోకాయుక్త న్యాయస్థానంలో సమర్పించారు.