నన్ను బలిపశువును చేస్తారా?..నేనెళ్లిపోతా! రాజీనామా వార్నింగ్ ఇచ్చిన స్పీకర్!
బెంగళూరు: అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్టుంది కర్ణాటక పరిస్థితి. అటు తిరిగి, ఇటు తిరిగి రాజీనామాల వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్కుమార్కు పీకకు చుట్టుకుంటోంది. శాసనసభలో బలాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం మొరాయిస్తోన్న నేపథ్యంలో.. స్పీకర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తీవ్రంగా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార కూటమి సోమవారం రాత్రి 9 గంటల్లోగా బలపరీక్షకు సిద్ధపడకపోతే తెల్లవారే సరికి తాను రాజీనామా చేసి పడేస్తానని స్పీకర్ హెచ్చరించారు.
సోమవారం సాయంత్రం శాసనసభ వాయిదా పడ్డ తరువాత ఆయన కాంగ్రెస్-జేడీఎస్ నేతలతో తన ఛాంబర్లో సమావేశం అయ్యారు. ఈ రాజకీయ సంక్షోభంలో తనను బలిపశువును చేయాలని అనుకుంటున్నారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను బలిపశువును కావాలని కోరుకోవట్లేదని అన్నారు. ప్రజలు తమను అనుక్షణం గమనిస్తున్నారని, అధికారం కోసం పడే పాట్లను చూసి నవ్వుకుంటున్నారని రమేష్కుమార్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారమే బలపరీక్షకు సిద్ధపడాలని ఆయన కాంగ్రెస్-జేడీఎస్ నాయకులకు సూచించారు. సుతిమెత్తగా హెచ్చరించారు. కుదరకపోతే తానే తప్పుకొంటానని అన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
అనంతరం- స్పీకర్ ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ సభ్యులతోనూ తన ఛాంబర్లో భేటీ అయ్యారు. సునీల్కుమార్, బసవరాజ్ బొమ్మై, సీటీ రవి, బహుజన సమాజ్వాది పార్టీ సభ్యుడు సా.రా. మహేష్, జేడీఎస్ సభ్యుడు, మంత్రి హెచ్డీ రేవణ్ణ, బండెప్ప కాశెంపూర్లు ఇందులో పాల్గొన్నారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కుమారస్వామి ససేమిరా అంటుండటం, ఏదో ఒక వంకతో కాలయాపన చేస్తుండటాన్ని బీజేపీ సభ్యులు ఈ సందర్భంగా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన బీజేపీకి అనుకూలంగా స్పందించారు. మీరే చూస్తున్నారు కదా. బలపరీక్షను నిర్వహించడానికి నేనేం చేయాలో, అన్నీ చేస్తున్నాను. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను.. అని స్పీకర్ వ్యాఖ్యానించారు.