భారతీయురాలివేనా?: విమానాశ్రయంలో డీఎంకే నేత కనిమొళికి చేదు అనుభవం
చెన్నై: విమానాశ్రయంలో తనను భారతీయురాలివేనా? అని ఓ సీఐఎస్ఎఫ్ అధికారి ప్రశ్నించారని ద్రావిడ మున్నేట్రా కళగం(డీఎంకే) నేత కనిమొళి తెలిపారు. తాను హిందీ మాట్లాడకపోవడం వల్లే అతను ఇలా అడిగారని చెప్పారు.
తనతో తమిళ భాషలో లేదా ఇంగ్లీషులో మాట్లాడాలని తాను కోరిన క్రమంలో సదరు సీఐఎస్ఎఫ్ అధికారి.. తనను భారతీయురాలివేనా? అని ప్రశ్నించారని కనిమొళి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె పేర్కొన్నారు. అంతేగాక, హిందీ మాట్లాడేవారినే భారతీయులుగా పరిగణిస్తారా? అని ఆమె ప్రశ్నించారు.
కాగా, తమిళ ప్రభుత్వాలు ఎప్పట్నుంచో హిందీని తమపై రుద్దవద్దంటూ ఎప్పట్నుంచో పేర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేగాక, తాజాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని కూడా తమిళ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు.
Today at the airport a CISF officer asked me if “I am an Indian” when I asked her to speak to me in tamil or English as I did not know Hindi. I would like to know from when being indian is equal to knowing Hindi.#hindiimposition
— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 9, 2020
కనిమొళి జాతీయతను ప్రశ్నించిన ఘటనపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. భాషను రుద్దాలనే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేసింది. అంతేగాక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.
మొదట్నుంచి తమిళనాడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలు హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. తాము తమిళనాడులో హిందీ భాషకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేశారు.