మాయావతి ఐడియా: ఆ భవనం కాన్షీరామ్ మోమోరియల్గా మార్పు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి యూపీ సీఎం మాయావతి తాను అధికారిక నివాసంగా ఉపయోగించుకొంటున్న భవనాన్ని కాన్షీరామ్ మోమోరియల్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రులు కొందరు తాము నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే మరికొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ప్రభుత్వ బంగ్లాలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆమెను కూడ ఆ బంగ్లాను ఖాళీ చేయాలని అధికారులు కోరారు. అయితే మాయావతి తాను నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను బిఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ స్మారక మందిరంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాన్షీరామ్ స్మారక మందిరంగా ఈ బంగ్లాను మార్చితే ఈ భవనాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకోవచ్చని బిఎస్పీ అధినేత్రి ఆలోచనగా అధికారులు అనుమానిస్తున్నారు. లక్నోలోని అధికారుల నివాస గృహల సముదాయంలోని 13 ఏ లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. అయితే అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ ఇంటికి కాన్షీరామ్ స్మారక మందిరంగా నేమ్ బోర్డును తగిలించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రులంతా ప్రభుత్వ బంగ్లాలోనే నివాసం ఉంటున్నారని, వారు ఈ నివాసాలను ఖాళీ చేయడం లేదని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలని ఈ ఏడాది మే మొదటి వారంలో తీర్పు చెప్పింది.
వీఐపీ జోన్లోని కీలకమైన బంగ్లాలు మొత్తం మాజీ సీఎంల ఆధీనంలోనే ఉన్నాయి. అఖిలేష్, ములాయంలు ఖరీదైన విక్రమాదిత్య రోడ్లోని బంగ్లాల్లో ఉంటున్నారు. ఇక మాయావతి, తివారీలు మాల్ అవెన్యూల్లోని బంగ్లాల్లో ఉంటున్నారు. రాజ్నాథ్ సింగ్ బంగ్లా 4కాళిదాస్ మార్గ్లో ఉంది. ఇప్పటికే రాజ్నాథ్ ఆ బంగ్లా నుంచి సొంత ఇంటికి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కల్యాణ్ సింగ్ కూడా బంగ్లాను ఖాళీ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.