పెను విషాదం: కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి
గౌహతి: అస్సాం రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలతోపాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనల్లో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో ఇలా కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది దక్షిణ అసోంలోని బారక్ లోయ పరిధిలో ఉన్న మూడు జిల్లాలకు చెందినవారే ఉన్నారని తెలిపారు.
ఈ ఘటనల పట్ల అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని శర్బానంద సోనోవాల్ అన్నారు. బాధితులు, బాధిత కుటుంబాలకు సహాయ సహకరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో దాదాపు 3.72 లక్షల మంది బాధితులుగా మారారు.
348 గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయని అస్సాం విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. 27వేల హెక్టార్లలో పంట నీట మునిగినట్లు తెలిపింది.
Seven people dead, nine injured after a landslide in Hailakandi district of #Assam pic.twitter.com/yGpc0jVc1f
— ANI (@ANI) June 2, 2020