అస్సాం కాంగ్రెస్లో ‘బద్రుద్దీన్’ చిచ్చు - ఏఐయూడీఎఫ్తో పొత్తుకు గొగోయ్ సిగ్నల్ - అనూహ్య పరిణామాలు
ఈశాన్య ముఖద్వారం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రఖ్యాత సుగంధాల వ్యాపారి, ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ కేంద్రంగా కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి.
పక్కా ముస్లిం పార్టీగా పేరుపొందిన ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపుగా ఖరారు కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ పొత్తు అస్సాం వినాశనానికే అని బీజేపీ తిట్టిపోస్తుండగా, పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ) అనంతర పరిస్థితులు తమకు కలిసొస్తాయని కొత్త మిత్రులు చెబుతున్నారు. కానీ పొత్తు ప్రపోజల్ ను జీర్ణించుకోలేక వందలాది మంది నేతలు కాంగ్రెస్ ను వీడుతున్నారు.
కరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్పైనా సంచలన నిర్ణయం
బద్రుద్దీన్ ఎవరు నుంచి..
‘పెర్ఫ్యూమ్ బారోన్'గా పాపులరైన బద్రుద్దీన్ అజ్మల్ మన దేశంలోని అత్యంత ప్రభావిత ముస్లిం నాయకుల్లో ఒకరు. విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆయనకు ముస్లిం వర్గాల్లో గొప్ప ఆదరణ ఉంది. 2005లో ఏఐయూడీఎఫ్ పేరుతో పార్టీ పెట్టినప్పటి నుంచీ అస్సాం ముస్లిం ఓటర్లు ఆయనకే మద్దతు పలుకుతున్నారు.
2006 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమతో పొత్తు పెట్టుకోవాలని యునైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ అప్పటి సీఎం తరుణ్ గొగోయ్ను కోరింది. ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా... ‘‘బద్రుద్దీన్ అజ్మల్ ఎవరు?'' అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అప్పట్నుంచి కాంగ్రెస్ కు ఎడంగా ఉంటోన్న ఏఐయూడీఎఫ్.. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీకి 2006లో 10 సీట్లు, 2011లో 18 సీట్లు, 2016 బీజేపీ హవాలోనూ 13 సీట్లను గెలుచుకుంది. నాడు పొత్తుకు బద్రుద్దీన్ ప్రయత్నిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలే ఆయనకు ఆఫరివ్వడం గమనార్హం.
ఎలా దగ్గరయ్యారంటే..
అస్సాంలో కనీసం 15 శాతం ఓట్ల బలమున్న ఏఐయూడీఎఫ్.. కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణంగా ఉంటూ వస్తోంది. బద్రుద్దీన్ పార్టీని బీజేపీ బీ-టీమ్ అని కాంగ్రెస్ తిడితే.. బీజేపీ వాళ్లు సైతం దాన్ని కాంగ్రెస్ బీ-టీమ్ గా అభివర్ణించేవాళ్లు. కాల క్రమంలో ఆ రెండు పార్టీలు తమకు జరుగుతోన్న నష్టాన్ని గుర్తించాయి. గత లోక్ సభ ఎన్నికల్లో తరుణ్ కొడుకు గౌరవ్ గొగోయ్ పోటీ చేసిన లోక్ సభ స్థానంలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థిని నిలబెట్టలేదు.
అలా మొదలైన దోస్తీ.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో మరింత బలపడింది. రెండు రాజ్యసభ సీట్లనూ బీజేపీ గెలుచుకున్నప్పటికీ.. తమ దోస్తీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేద్దామని గొగోయ్ ప్రతిపాదించగా, అందుకు బద్రుద్దీన్ సరేనన్నట్లు తెలిసింది. పొత్తు ఇంకా ఖరారు కాకముందే రెండు పార్టీల నేతలూ పాజిటివ్ స్టేట్మెంట్లు ఇస్తుండటంతో ఇంకాస్త క్లారిటీ ఏర్పడింది.
కరోనా వేళ షాకింగ్ బిజినెస్ - వాడి పారేసిన గ్లవ్స్ మళ్లీ అమ్మకం - ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా?
మత పార్టీతో మనకేల?
బయటికి వెల్లడించనప్పటికీ, కాంగ్రెస్ అంతర్గతంగా ఓ నిర్ణయానికి వచ్చిందని, ఎన్నికల కంటే ముందే బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్ తో పొత్తును ఖరారు చేసుకుందామని తరుణ్ గొగోయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రిపున్ బోరా కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు.
అయితే, గొగోయ్ వ్యతిరేక వర్గం మాత్రం ఈ ప్రతిపాదనపై మండిపడింది. మతతత్వ పార్టీగా ముద్రపడ్డ ఏఐయూడీఎఫ్ తో పొత్తును వ్యతిరేకిస్తూ, బోరాను పీసీసీ చీఫ్ గా తొలగించాలంటూ ఆ వర్గం అధిష్ఠానానికి లేఖలు రాసింది. ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వేల మంది కార్యకర్తలు, నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అస్సాం కాంగ్రెస్ లో ‘బద్రుద్దీన్' చిచ్చుపెట్టారా? అనే ప్రశ్నకు పీసీసీ చీఫ్ బోరా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
పొత్తు ఫలిస్తుందా?
‘‘ముస్తిం పార్టీగా గుర్తింపు పొందిన ఏఐయూడీఎఫ్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ప్రత్యర్థులైన బీజేపీ వాళ్లు ఎలాంటి దుష్ప్రచారం చేస్తారో మాకొక అవగాహన ఉంది. అయితే అస్సాం రాజకీయాలు గతంలోలా లేవు. సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాల తర్వాత ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేక ఏర్పడింది.
విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీట్లుకునే కంటే, ఒక్కటిగా పోరాడి బీజేపీని ఓడించాలన్నదే మా ప్రయత్నం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా సైద్ధాంతిక విరోధులతో పొత్తు పెట్టున విషయాన్ని మర్చిపోరాదు. బద్రుద్దీన్ గానీ, మరో పార్టీగానీ దాన్ని ప్రజలు బీజేపీ వ్యతిరేక వేదికలుగానే చూస్తారు తప్ప, కులమతాలు పట్టించుకోరు''అని అస్సాం పీసీసీ చీఫ్ రిపున్ బోరా వివరించారు.
Recommended Video
కాంగ్రెస్-ముస్లిం పొత్తుపై బీజేపీ విసుర్లు
అస్సాంలో బీజేపీకి 42 లక్షల మంది సభ్యులున్నారని, ఒక్కొక్కరు అదనంగా ఒక వ్యక్తితో ఓటేయించినా 84 లక్షల ఓట్లతో ఈజీగా మెజార్టీ సీట్లు సాధిస్తామని, బద్రుద్దీన్-కాంగ్రెస్ ల పొత్తు ప్రభావం ఎన్నికల్లో ఉండదని అస్సాం బీజేపీ చీఫ్ రంజీత్ దాస్ అన్నారు. అస్సాంలో బీజేపీ విజయంలో కీలక భూమిక పోషించిన మంత్రి హిమంత బిశ్వాస్ శర్మ మరో అడుగు ముందుకేసి, కాంగ్రెస్-ఏఐయూడీఎఫ్ పొత్తు ఖరారైతే గనుక బద్రుద్దీన్ డ్రిల్ మాస్టర్ లాగా, తరుణ్ గొగోయ్ విన్యాసాలు చేసే విద్యార్థిలాగా మారే దృశ్యాలను చూడబోతున్నామని ఎద్దేవా చేశారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే అస్సాం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.