ఏబీపీ-సీ ఓటర్ సర్వే : అసోంలో మళ్లీ బీజేపీదే అధికారం... ఎన్ని సీట్లు వస్తాయంటే...
అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడైంది. సర్వే ప్రకారం అసోంలో మరోసారి బీజేపీనే అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. మొత్తం 43.8 శాతం ఓట్లు,72 సీట్లతో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
అదే సమయంలో కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ కూటమి 41.4శాతం ఓట్లతో కేవలం 47 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. బీపీఎఫ్కు 4 సీట్లు,ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయే కూటమి అసోంలో 41.9శాతం ఓటింగ్తో 74 సీట్లు సాధించగా... కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ 31శాతం ఓట్లతో 26 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. గతం కన్నా యూపీఏ ఓటింగ్ పెరిగినప్పటికీ సీట్లు మాత్రం పెద్దగా పెరిగే అవకాశం లేనట్లు వెల్లడైంది.
కాగా,అసోంలో మార్చి 27,ఏప్రిల్ 1,ఏప్రిల్ 6 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఈ-నామినేషన్లకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఓటింగ్ సమయంలో ఓటర్లకు హ్యాండ్ గ్లవ్స్,ముఖానికి మాస్కులు ఇవ్వనున్నారు.
అసోంతో పాటు తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఒపీనియన్స్ పోల్స్ను కూడా ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బెంగాల్లో టీఎంసీ,తమిళనాడులో డీఎంకె,పుదుచ్చేరిలో బీజేపీ,కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.