బోడోల దాడి పిరికిపంద చర్య... సంయుక్త ఆపరేషన్: తరుణ్ గోగోయ్
గౌహతి: అస్సాంలో బోడో తీవ్రవాదులు గిరిజనులపై జరిపిన దాడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. విలేకరులతో మాట్లాడుతూ బోడో తీవ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తీవ్రవాదుల బెదిరింపులకు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ లొంగదని అన్నారు. ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడితే ఉగ్రవాదులను కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు. బోడో తీవ్రవాదులను అణిచివేసేందుకు రాష్ట్ర బలగాలతో కలిసి ఆపరేషన్ చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రానికి పారామిలిటరీ బలగాలను పంపాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాద్ సింగ్కు విజ్ఞప్తి చేశానని వివరించారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కేంద్రం 55 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను పంపిస్తుందని అన్నారు. మరో రెండు రోజుల్లో ఈ బలగాలు రాష్ట్రానికి చేరనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో 20 కంపెనీల భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాడులు జరిపి బోడో ఉగ్రవాదులు పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భూటాన్లకు లేదా అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్ రాష్ర్టాలకు పారిపోతున్నారని దీంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా ఉందని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టినా తీవ్రవాదులు దేశంలోపలో, వెలుపలో ఆశ్రయం తీసుకునే అవకాశం ఉందని వివరించారు. బుధవారం రాష్ట్రానికి రానున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్తో సంయుక్త ఆపరేషన్ గురించి మాట్లాడతానని అన్నారు.
దాడి జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు వెళుతున్న హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అస్సాం ముఖ్యమంత్రితో తాజా పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రజల్లో భయానకర వాతావరణం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే దాడులకు తెగబడ్డారని వ్యాఖ్యానించారు.
హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ మాట్లాడుతూ ఈ హింసాత్మక దాడులను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దాడులకు దిగిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులను గట్టిగా తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు.
‘‘అమాయకులైన గిరిజనులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించక తప్పదు'' అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బోడో తీవ్రవాదుల మారణహోమంపై నిరిసనలు వెల్లువెత్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.