అసోం సర్కారు సంచలన నిర్ణయం-మదర్సాలు, సంసృత పాఠశాలల మూసివేత..
అసోంలో బీజేపీ సర్కారు మతపరమైన విద్యను ప్రోత్సహించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మతపరమైన విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిధులు ఇవ్వరాదని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సహంతో నడుస్తున్న మదర్సాలతో పాటు సంస్కృత పాఠశాలలూ మూతపడనున్నాయి.
ప్రభుత్వ నిధులతో మతపరమైన విద్యను ప్రోత్సహించరాదని తమ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో నిర్ణయం తీసుకుందని ఆర్ధికమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. నవంబర్లో ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న మదర్సాలు, సంస్కృత పాఠశాలల విషయంలో చేసేదేమీ లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పలు మదర్శాలు, సంస్కృత పాఠశాలల్లో పనిచేస్తున్న 48 మంది కాంట్రాక్టు సిబ్బందిని విద్యాశాఖ పరిధిలోని సాధారణ పాఠశాలల్లోకి బదిలీ చేయనున్నారు.
Recommended Video
అసోం ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 614 మదర్శాలు, వెయ్యి సంసృత పాఠశాలలు మూతపడబోతున్నాయి. మదర్శాల్లో 57 బాలికల, మూడు బాలుర, 554 కో ఎడ్యుకేషన్ ఉన్నాయి. అలాగే సంస్కృత పాఠశాలల్లో వంద ఎయిడెడ్ స్కూళ్లుగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం మదర్సాలపై ఏటా 3 నుంచి 4 కోట్ల రూపాయలు, సంస్కృత పాఠశాలలపై కోటి వరకూ ఖర్చుపెడుతోంది. అసోం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆలిండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధినేత బద్రుద్రీన్ అజ్మల్ తప్పుబట్టారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలిచి తాము వీటిని పునరుద్ధరిస్తామన్నారు.