అసోంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల... 11 మంది కొత్త ముఖాలకు చోటు...
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ శుక్రవారం(మార్చి 5) 70 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. తాజా జాబితాలో జాబితాలో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవడం గమనార్హం. వారి స్థానంలో కొత్త వాళ్లకు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇదే జాబితాలో ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్తో పాటు హోంమంత్రి హిమంత బిశ్వా శర్మ పోటీ చేస్తున్న స్థానాలను పార్టీ ప్రకటించింది. శర్భానంద సోనోవాల్ మజులి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి,హిమంత బిశ్వ శర్మ జలుక్బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నట్లు వెల్లడించింది. ఈ ఇద్దరూ గతంలోనూ ఇవే నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.
'అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసోం గణ పరిషత్(ఏజీపీ),యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్)తో కలిసి బరిలో దిగుతుంది. మొత్తం 126 స్థానాలకు గాను ప్రస్తుతం 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాం. 26 సీట్లు ఏజీపీకి,8 సీట్లు యూపీపీఎల్ పార్టీకి సర్దుబాటు చేస్తున్నాం.' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.
అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో అసోంను వరదలు లేని రాష్ట్రంగా చేయాలన్న సవాల్ తమ ముందు ఉందన్నారు. ఇప్పటివరకూ కొనసాగించిన అభివృద్ది ఎజెండానే ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. అలాగే ఎన్ఆర్సీ వంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అసోం ప్రజలు మరోసారి బీజేపీకే అధికారం కట్టబెడుతారని ధీమా వ్యక్తం చేశారు.
అసోంలో మార్చి 27,ఏప్రిల్ 1,ఏప్రిల్ 6 తేదీల్లో మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు,రెండో దశలో 39,మూడో దశలో 40 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మిగతా రాష్ట్రాలతో పాటే మే 2వ తేదీన వెలువడనున్నాయి. గత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో బీజేపీ 60 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పదేళ్ల పాలనకు తెరపడింది. ఈసారి ఎన్నికల్లో అసోం ఓటరు తిరిగి బీజేపీకే పట్టం కడుతారా లేక కాంగ్రెస్ను గద్దెనెక్కిస్తారా అన్నది చూడాలి.