బిజెపి నేత కొడుకు కిడ్నాప్: రూ. కోటి డిమాండ్ చేస్తున్న ‘ఉల్ఫా’
గౌహతి: అస్సాం భారతీయ జనతా పార్టీ నేత రత్నేశ్వర్ మారన్ కొడుకు కుల్దీప్ను కొద్ది రోజుల క్రితం(ఆగస్టు 1న) ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతడ్ని విడుదల చేయాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు కుల్దీప్ వాయిస్తో సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో గ్రీన్ టీ షర్ట్ వేసుకొని మోకాళ్లపై కుల్దీప్ ఉండగా అతని వెనుక ఐదుగురు ఉగ్రవాదులు తుపాకులతో నిలబడ్డారు.
తన ఆరోగ్యం క్షీణించిందని వీడియోలో కుల్దీప్ పేర్కొన్నారు. తనను ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని కుల్దీప్ ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ను వేడుకున్నారు.
కాగా, కుల్దీప్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ఉగ్రవాదులను కోరారు. హింసా అనేది సమాజానికి మంచిది కాదు, శాంతిని మా ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు. శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని, అతడ్ని వెంటనే విడుదల చేయాలని హితవు పలికారు.