బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా: సీఎంగా ఆరోగ్యశాఖ మంత్రికి లైన్ క్లియర్: కాస్సేపట్లో డిక్లేర్
గువాహటి: అస్సాంలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ జగదీష్ ముఖికి అందజేశారు. శర్బానంద రాజీనామాతో ఆయన వారసుడిగా హిమంత బిశ్వ శర్మకు లైన్ క్లియర్ అయినట్టే. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ఆయన కొత్త ముఖ్యమంత్రి పేరును ఇంకాస్సేపట్లో ఖరారు చేయనున్నారు.
అస్సాం వైద్య-ఆరోగ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న హిమంత బిశ్వ శర్మ పేరును తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించడం దాదాపు ఖరారైంది. హిమంత బిశ్వ శర్మ సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోవడం, అస్సాం బీజేపీకి చెందిన మెజారిటీ నాయకులు ఆయన నాయకత్వం వైపే మొగ్గు చూపడం వంటి కారణాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ నాయకుడు. సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2015లో పార్టీ ఫిరాయించారు. బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2016 నాటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఆయన జలుక్బారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. 1,01,911 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రామెన్ చంద్ర బోర్థకుర్పై విజయం సాధించారు. హిమంతకు లభించిన 1,30,762. లక్షకు పైగా ఓట్లను సాధించడం ఆయనకు ఇది వరుసగా రెండోసారి. 2016 ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1,18,890 ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. సొనొవాల్ కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
సమర్థుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడదే ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. హిమంత వంటి నాయకుడి అండ సొనొవాల్కు లేకపోయి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవంటూ ఆయన వర్గీయులు కుండబద్దలు కొడుతున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని హిమంత సృష్టించుకున్నారని చెబుతున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాలు, స్థానిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బీజేపీ అధిష్ఠానం.. అస్సాం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంతను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.