అస్సాం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్(79) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయనను ఇంటికి తరలించారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అస్సాం మెడికల్ కాలేజీ వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
దీంతో తరుణ్ గొగోయ్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇంటికి తరలించారు. అతిసారం మూలంగా డీహైడ్రేషన్కు గురయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకుంటున్నారని మంగళవారం ప్రకటించాయి. ఆ తర్వాత అనారోగ్యం తీవ్రం కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
కాగా, 2010లో ముంబై వైద్యులు.. గొగోయ్కు ట్రిపుల్ వెస్సల్ బైపాస్ సర్జరీ నిర్వహించారు. అనంతరం కొన్ని నెలల తర్వాత అసోం ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.