కేరళలో బీజేపీ నేత చరిత్ర, అసోంలో కమల వికాసం, బెంగాల్లో ఖాతా
ఢిల్లీ: అసోం అసెంబ్లీ బీజేపీ దూసుకు పోయింది. మొత్తం 126 స్థానాల్లో బీజేపీ 76 స్థానాల్లో విజయం సాధించగా 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించగా 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఏఐయూడీఎఫ్ 11 స్థానాల్లో విజయం సాధించగా 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తగ్గట్లే అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. ఈశాన్యంలో ఇది కమల వికాసమే.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది. 1952లో బీజేఎస్ (జనసంఘ్) 9 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు బీజేపీ అన్ని స్థానాలు గెలుచుకోలేదు. ఇప్పుడు 3 సీట్లు గెలుచుకుంది. నాలుగో సీటు కూడా కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది.
ప్రధాని మోడీ ట్వీట్
అసోంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి శర్వానంద సోనోవాల్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో చరిత్రాత్మక విజయం సాధించినందుకు కార్యకర్తలకు, అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయం సాధించడానికి, ప్రచారం కోసం పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారని వారందరికీ ధన్యవాదాలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. అసోంలో 15ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తోంది.
కేరళలో చరిత్ర సృష్టించిన రాజగోపాల్
తన విజయంతో కేరళలో కమల వికాసం మొదలైందని బీజేపీ సీనియర్ నేత ఓ రాజగోపాల్ అన్నారు. గురువారం వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చరిత్ర సృష్టించారు. కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని అందించిన నేతగా ఆయన నిలిచారు. నీమమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్ కుట్టిపై 8వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్నికల ఫలితం వెలువడిన అనంతరం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఖాతా తెరవబోదని సీపీఎం, కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు అన్నాయని గుర్తు చేశారు.