ఐదుగురుని చంపిన ఆ ‘ఒసామా బిన్ లాడెన్’ మృతి చెందింది: బంధించడమే కారణమా?
గౌహతి: ఐదుగురిని చంపిన 'ఒసామా బిన్ లాడెన్'ను ఏనుగును గత కొద్ది రోజుల క్రితమే అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఏనుగు ఆదివారం ఉదయం మృతి చెందింది. తొలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బంధించిన తర్వాత ఆ ఏనుగు మృతి చెందడం గమనార్హం.
ఒకే రోజు..
నవంబర్ 11న అసోంలోని గోల్పారా జిల్లా రాంగ్జూలీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ మదపుటేనుగుకు అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బంధించారు.అటవీ ప్రాంతంలో నివాసముంటున్న ఐదుగురు గ్రామస్తులను ఒకే రోజు ఈ ఏనుగు చంపడంతో అటవీశాఖ అధికారులు ఈ ఏనుగును బంధించారు.
ప్రభుత్వం సీరియస్..
కాగా, బిన్ లాడెన్ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అసోం ప్రభుత్వం ఏనుగు మృతికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులను నియమించింది. పోస్టుమార్టం నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించింది.
బంధించడమే కారణమా?
తొలి నుంచి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ బిన్ లాడెన్ ఏనుగు మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. కాగా, సాధారణంగా 6-7ఏళ్ల వయస్సుగల ఏనుగుల్ని మాత్రమే బోనులో బంధిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం 35ఏళ్ల వయసు కలిగిన బిన్ లాడెన్ అలియాస్ కృష్ణను అధికారులు బోనులో పెట్టడంపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడ్డారు.
అలా బిన్ లాడెన్ ఏనుగు అయ్యింది..
అసోంలోని గోల్పారా జిల్లాలోని అడవుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఓ ఏనుగుకు ఇక్కడి ప్రజలు ‘ఒసామా బిన్ లాడెన్' అనే పేరు పెట్టారు. కాగా, అక్టోబర్ నెలలో కేవలం 24 గంటల్లోనే ఆ ఒసామా బిన్ లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీసింది. ఈ ఏనుగు దాడిలో మరణించినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కాగా, గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2300 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అదే సమయంలో 2011 నుంచి 700 ఏనుగులు కూడా చంపివేయబడ్డాయి.