అసోంను వదలని వరదలు.. 20 మంది మృతి.. మూగజీవాలకు ఎంత కష్టం.. (వీడియో)
గౌహతి : అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో 52లక్షల మంది ప్రభావితులయ్యారు. ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
30జిల్లాలపై వరద ప్రభావం
అసోంలో మొత్తం 33లో 30జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. కుండపోత వర్షాలు, వరద కారణంగా ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. బర్పేట, ధుబ్రీ, సల్మారా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. దాదాపు 4,600గ్రామాలు నీట మునిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 11 నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గువహతి గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది.
నీటిలో మూగజీవాల కష్టాలు
వరదల కారణంగా జనంతో పాటు మూగ జీవాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వరద నీటిలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. కాజీరంగా నేషనల్ పార్కులో జంతువుల పరిస్థితి దారుణంగా మారింది. దాదాపు 90శాతం ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇప్పటి వరకు 30 వరకు జంతువులు ప్రాణాలు కోల్పోయాయి
కొనసాగుతున్న సహాయక చర్యలు
అసోంలో వరద బాధితులను ఆదుకునేందుకు 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 380 మంది సిబ్బంది జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్మీతో పాటు ఎయిర్ఫోర్స్ సిబ్బంది సైతం సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చాపర్లు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచారు.
ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం
కుండపోత వర్షాలు వరదలతో అతలాకుతలమైన అసోంను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. తక్షణ సాయంగా రూ. 251.5కోట్ల నిధులు విడుదల చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు జలశక్తి శాఖ సహాయమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను అసోంకు పంపారు. సీఎం సర్బానంద సోనోవాల్కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ తాజా పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వరద బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు వారికి తక్షణ సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.