చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు
గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు.
కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ మంటలు ఎగిసిపడుతుండటం గమనార్హం. ఈ మంటలను అదుపులో చేసే క్రమంలోనే ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మే 28 నుంచి ఈ చమురు బావిలో గ్యాస్ లీకవుతోంది. కాగా, జూన్ 9 నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపులో చేసే ప్రయత్నంలో ఇప్పటికే ఇద్దరు ఫైరింజిన్ సిబ్బంది మరణించారు .
Recommended Video
ఈ క్రమంలో విదేశాల నుంచి నిపుణులను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నం కూడా తాజా ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ లీకవడం ,మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.