చమురు బావిలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిన మంటలు, ప్రజల తరలింపు
గౌహతి: అస్సాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలో భగ్జన్ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్)కు చెందిన చమురు బావిలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
కాగా, గత 14 రోజులుగా సంస్థకు చెందిన చమురు బావిలో గ్యాస్ లీక్ అవుతోంది. సోమవారం సింగపూర్ నుంచి వచ్చిన నిపుణుల బృందం గ్యాస్ లీక్ను అరికట్టేందుకు ప్రయత్నించింది. అయితే, వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓఎన్జీసీకి చెందిన సిబ్బంది స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో సింగపూర్ ప్రతినిధులు, ఇతర నిపుణలు దులియజాన్లోని ఆయిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఘటన స్థలంలో ఎక్కువ సిబ్బంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కాగా, ఈ ప్రమాదం కారణంగా నష్టపోయిన వారికి రూ. 30వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఓఐఎల్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలోని ఆరువేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
#WATCH Massive fire at the gas well of Oil India Ltd at Baghjan in Tinsukia district, Assam. A team of National Disaster Response Force (NDRF) is present at the spot pic.twitter.com/Tw2G92aPXy
— ANI (@ANI) June 9, 2020