ఆర్మీ కాన్వాయ్పై కాల్పులు: ముగ్గురు జవాన్లు మృతి
అస్సాంలోని టిన్సుకియా జిల్లా పెంగ్రిలో శనివారం ఉదయం ఉగ్రవాదులు సైన్యంపై దాడికి తెగబడ్డారు.
గౌహతి: అస్సాం రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టిన్సుకియా జిల్లా పెంగ్రిలో శనివారం ఉదయం ఉగ్రవాదులు సైన్యంపై దాడికి తెగబడ్డారు. అనుమానిత ఉల్ఫా ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఐఈడీ పేలడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించామని రాష్ట్ర డీజీపీ ముఖేశ్ సహయ్ వెల్లడించారు.
ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలియాల్సి ఉందని తెలిపారు. ఉగ్రదాడిని భద్రతా బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు.
హోంమంత్రి రాజ్నాథ్ ఆరా
టిన్సుకియాలో జరిగిన ఉగ్రదాడి గురించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్కు ఫోన్ చేసి పది నిమిషాలపాటు మాట్లాడారు. కేంద్రమంత్రికి సీఎం సోనోవాల్ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చేపట్టిన చర్యలను ఆయనకు వివరించారు. ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం, గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని రాజ్నాథ్ ఆకాంక్షించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం ఉదయం ఉల్ఫా, ఎన్ఎస్సీఎన్(కె) గ్రూపులకు చెందిన దాదాపు 15 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడికి తెగడిన విషయం తెలిసిందే.