ఇద్దరి సీఎంలపై తిరుగుబాటు, సీనియర్ మంత్రుల రిజైన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాల్లో తిరుగుబాటు తలెత్తింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కేబినెట్ నుంచి సీనియర్ మంత్రి నారాయణ్ రాణే, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ సర్కార్ నుంచి హిమంత బిస్వాస్ శర్మ సోమవారం రాజీనామా చేయడంతో పరిస్థితి సంక్షోభ స్థాయికి చేరుకుంది.
ఇప్పటికే చౌహాన్ను తొలగించాలంటూ రాణేతో పాటు మహారాష్ట్రకు చెందిన అనేక మంది సీనియర్ మంత్రులు, నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై వత్తిడి తెచ్చారు. తాజా పరిణామంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి మొదలైంది. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటి నుంచీ చౌహాన్కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతూనే వచ్చాయి. రాణే రాజీనామాతో పరిస్థితి మరింత వేడెక్కినట్టయింది.
లోకసభ ఎన్నికల్లో వైఫల్యానికి ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ అసమర్థ నాయకత్వమే కారణమంటూ అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం మొదలైంది. దాదాపు 38మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గగోయ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సోమవారం వరకూ డెడ్లైన్ విధించారు.
అయినా హైకమాండ్ నోరుమెదపక పోవడంతో గగోయ్ ప్రభుత్వం నుంచి హిమంత రాజీనామా చేశారు. ఆయన సారథ్యంలో 38మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ జెబి పట్నాయక్ను కలుసుకుని గగోయ్ పట్ల తమకు ఎలాంటి విశ్వాసం లేదని స్పష్టం చేశారు. అయితే రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కూడా రాణే, శర్మలు రాజీనామా చేశారని ఇప్పుడు కూడా అదే విధంగా వెనక్కి తగ్గుతారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాయి. రాజీనామా చేసిన అనంతరం ముంబయిలో విలేఖరులతో మాట్లాడిన రాణే మరింత తీవ్ర స్వరంతో ముఖ్యమంత్రి చవాన్పై విరుచుకు పడ్డారు. చవాన్కు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం రాదని, పాలనా వ్యవస్థపై కూడా ఆయనకు ఎలాంటి పట్టు లేదని ఆరోపించారు.