ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు వాపస్ -సరిహద్దు గొడవలపై అస్సాం, మిజోరం చర్చలు -ఆగస్టు 5 నుంచి
దేశంలో అరుదైన సంఘటనగా రెండు రాష్ట్రాల మధ్య రక్తపాతం జరగడం, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్య కేసు నమోదు కావడం ఇటీవల ఈశాన్య భారతంలో చోటుచేసుకుంది. అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కాస్తా హింసాత్మక ఘర్షణగా మారి, అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోవడం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపైనే మిజోరం పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడం తెలిసిందే. అయితే, కేంద్రం నుంచి వరుస వినతుల నేపథ్యంలో ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంలు కాస్త చల్లబడ్డారు...
సరిహద్దు వివాదంపై ఘర్షణలు, హత్యలకు సంబంధించి కేసుల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మరో ఆరుగురు ఉన్నతాధికారులపై నమోదు చేసిన మర్డర్ అటెంప్ట్ కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు మిజోరం ముఖ్యమంత్రి జొరాంతాంగ అధికారికంగా ప్రకటించారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి అస్సాంతో చర్చలు జరపాలనే నిర్ణయం తీసుకున్న దరిమిలా, చర్చల ప్రక్రియ సుహృద్భావంగా జరిగేందుకు వీలుగా ఇటీవల అస్సామీలపై నమోదైన అన్ని కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. మరోవైపు..
సరిహద్దు వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకుంటామన్న మిజోరం సీఎం ప్రకటనను అస్సాం సీఎం హింత బిశ్వ శర్మ ఆహ్వానించారు. మిజోరం సీఎం బాటలోనే.. అస్సాం సీఎం సైతం మిజో పోలీసులపై దాఖలుచేసిన అన్ని కేసుల్ని వెనక్కి తీసుకోవాలని తన రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. అస్సాంపై అనుచిత వ్యాఖ్యలుచేసిన మిజోరం ఎంపీపైనా కేసు వాపస్ తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈశాన్యంలో కీలక రాష్ట్రాలైన అస్సాం, మిజోరం మధ్య ఎంతో కాలంగా నానుతోన్న సరిహద్దు వివాదం ఇంటీవల మళ్లీ తెరపైకి రావడం, మిజో రైతులదిగా చెబుతోన్న భూభాగంలో అస్సాం పోలీసులు విధ్వంసానికి పాల్పడటం, పంటలను తగులబెట్టడం తెలిసిందే. అయితే సదరు భూభాగం తమకే చెందుతుందంటోన్న అస్సాం.. మిజో రైతులే ఆక్రమణలకు పాల్పడ్డారని వాదిస్తోంది. ఈ క్రమంలో జులై 26న రెండు రాష్ట్రాల పోలీసులు, ప్రజల మధ్య ఘర్షణ జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చివరికి..
సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం అస్సాం, మిజోరం రాష్ట్రాలు చివరికి చర్చల ప్రక్రియకు ఉపక్రమించాయి. ఈనెల 5 నుంచే ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. అస్సాం కేబినెట్ మంత్రులు ఇద్దరు ఆగస్టు 5న ఐజ్వాల్(మిజోరం రాజధాని)కి వెళ్లి అక్కడి యంత్రాంగాన్ని కలడవం ద్వారా చర్చల ప్రక్రియ ఆరంభమవుతుందని, తొలి విడత ఫలితాన్ని బట్టి పలు దఫాల్లో చర్చలు ఉంటాయని అస్సాం సీఎం హిమంత చెప్పారు.