షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం
ఈశాన్య భారతంలో పరిస్థితి రోజురోజుకూ మరింత జఠిలంగా మారుతున్నది. అస్సాం-మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఇంకాస్త ముదిరింది. బోర్డర్ వద్ద ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించిన ఘటనకు సంబంధించి అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు నమోదుకాగా, ఏకంగా భారత సైన్యానికే ఆంక్షలు విధించిన వైనం ఆశ్చర్యపరుస్తున్నది. కేంద్రం చోద్యం చూస్తోందా? అనే అనుమానాలు తీవ్రతరం అవుతున్నాయి. వివరాలివి..
జగన్కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామ
జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ
ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు..
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం గంటకో మలుపు తిరుగుతున్నది. అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి ఈనెల 26న(సోమవారం) జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించగా, సదరు ఘటనపై మిజోరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హత్యాయత్నం, కుట్ర పూరిత నేరం, ఆయుధాలతో దాడి తదితర ఆరోపణలు మోపారు. అస్సాం సీఎంతోపాటు ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులు, గుర్తుతెలియని మరో 200 మందిపైనా ఇవే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఆయన ఆదేశాలతోనే ఆయుధాలతో దాడి
''అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 200 పైచిలుకు పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు, టెంట్ సామాగ్రితో మిజోరం సరిహద్దుల్లోకి ప్రవేశించారు. మిజోరం భూభాగాన్ని ఆక్రమించి, కోలాసిబ్ జిల్లా సరిహద్దులోని చెక్ పోస్టును ధ్వంసం చేసి, అక్కడ తమ క్యాంప్ ఏప్రాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కోలాసిబ్ జిల్లా ఎస్పీ అక్కడికెళ్లి అస్సాం పోలీసుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అస్సాం వాళ్లు ఎంతకీ వినలేదు. అలజడి రేపాలన్న ముందస్తు వ్యూహంతోనే కాల్పులకు తెగబడ్డారు. లభించిన ఆధారాల మేరకు అస్సాం సీఎం, అధికారులు, గుర్తుతెలియని 200 మందిపై మర్డర్ అటెంప్ట్ ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు పెట్టాం'' అని ఎఫ్ఐఆర్ లో మిజోరం పోలీసులు పేర్కొన్నారు.
ఇండియన్ ఆర్మీపైనా తీవ్ర ఆంక్షలు
అస్సాంతో సరిహద్దు గొడవల నేపథ్యంలో మిజోరాం తన రాష్ట్ర సరిహద్దును 'నో ఫ్లై జోన్'గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో డ్రోన్లుగానీ ఇతరత్రా వాహకాలు వేటినీ అనుమతించబోమని చెప్పింది. శుక్రవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండియన్ ఆర్మీకి కూడా ఆంక్షలు వర్తిస్తాయి. ఆర్మీ గనుక మిజోరం బోర్డర్ లో ఏవైనా కార్యకలాపాలు చేయాలనుకుంటే, డ్రోన్ల ఎగరవేత లేదా ఇంకేదైనా అనుకుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని 'నో ఫ్లై జోన్' ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అస్సాం పౌరులెవరూ మిజోరం వెళ్లొద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అస్సాం సీఎం హింమత శర్మ ఆదేశాలివ్వగా, దానికి కౌంటర్ గానే మిజోరం సర్కారు మర్డర్ కేసు, నో ఫ్లై జోన్ చర్యలకు దిగింది.
ముందు కాల్పులు జరిపింది వాళ్లే..
ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు చనిపోవడంతోపాటు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడిన జులై 26నాటి ఘర్షణకు సంబంధించి అస్సాం పోలీసులు.. మిజోరం పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తునకు సహకరించాలని అస్సాం కోరగా.. అసలు కాల్పులకు పాల్పడింది అస్సాం పోలీసులే అని మిజో సీఎం ఆరోపించారు. అస్సాం నుంచి వచ్చే మిజోరం పౌరులను హిమంత సర్కార్ అడ్డుకోవడం దారుణమని, ఓవైపు సామరస్య చర్చలు అంటూనే అస్సాం ఈరకంగా వ్యవహరించడమేంటని మిజో సీఎం జోరాంతాంగా ప్రశ్నించారు. మరోవైపు, మిజోరం ఎంపీ కే వన్లావేనపైనా అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.''అస్సాం పోలీసులు అదృష్టవంతులు. మేము అందరినీ చంపలేదు కదా'' అని ఎంపీ పార్లమెంట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అస్సాం పోలీసులు ఢిల్లీలోని ఎంపీ నివాసానికి నోటీసులు పంపించారు. ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని హెచ్చరించారు.
Recommended Video
కొట్టుకు చస్తున్న రాష్ట్రాలు.. కేంద్రం వేడుక?
ఈశాన్య రాష్ట్రాల మధ్య గతం నుంచీ సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో హత్యాకాండ జరగడం, ముఖ్యమంత్రిపైనే మర్డర్ కేసు పెట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.అస్సాం-మిజోరం మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అస్సాంలోని కచార్, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న భూభాగమే ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణం. సరిహద్దులో రక్తపాతం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడి, సంయమనం పాటించాల్సిందిగా ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గకపోవడం, రెండు ప్రభుత్వాలు పరస్పరం మాటల దాడి, కేసుల నమోదు కొనసాగిస్తుండటం పరిస్థితిని ఇంకాస్త దిగజార్చుతోంది. ప్రస్తుతం అస్సాం-మిజోరం సరిహద్దు వెంబడి ఆరు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. జాతీయ రహదారి 306 వెంబడి కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. రాష్ట్రాలు కొట్టుకు చస్తోంటే, కేంద్రంలోని మోదీ సర్కార్ వేడుక చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.