కరోనా: నిర్భంద కేంద్రాల కన్నా దారుణం, క్వారంటైన్ కేంద్రాలపై ఎమ్మెల్యే కామెంట్లు, అరెస్ట్..
కరోనా వైరస్ సృష్టిస్తోన్న బీభత్సంతో భయాందోళన నెలకొంది. కానీ కొందరు మాత్రం నోరు పారేసుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉంటూ.. కామెంట్లు చేస్తున్నారు. వారిపై ప్రభుత్వాలు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. తాజాగా అసోంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసోంకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ప్రజా ప్రతినిధి. కానీ అసోంలో క్వారంటైన్లో ఉంచిన వారిపై నోరు పారేసుకున్నారు. క్వారంటైన్ సెంటర్లు నిర్భంద కేంద్రాలను తలపిస్తున్నాయని కామెంట్ చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని ఉంచే నిర్భంద కేంద్రాల్లో కూడా మెరుగైన వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతేకాదు ఢిల్లీ సభలకు వెళ్లొచ్చిన వారిని మెడికల్ సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా ఇంజెక్షన్లు ఇచ్చి అనారోగ్యానికి గురిచేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఇస్లాం మిషనరీ సంస్థ తబ్లిగి జమాత్ నిర్వహించిన మత సభలతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో అసోలో పాజిటివ్ సోకిన వారిని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. 33 జిల్లాలకు చెందిన 2 వేల మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. సరు సోజాయ్ స్టేడియంలో 2 వేల పడకలు సమకూర్చారు. అక్కడే వారికి చికిత్స అందిస్తోండగా.. ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. దీనిపై అమినుల్ను సోమవారం ప్రశ్నించి.. మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్ గురించి స్పీకర్కు సమాచారం అందజేశామని పోలీసు ఉన్నతాధికారి భాస్కర్ జ్యోతి మహంతా తెలిపారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా అమినుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.