రామమందిరం నిర్మాణానికి అస్సాం పేద ముస్లింల భారీ విరాళం..!
గువాహటి: వారంతా పేద, దిగువ మధ్య తరగతికి చెందిన ముస్లింలు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ ఆర్థిక పరిస్థితి వారిది. అయినప్పటికీ- చారిత్రాత్మక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసే సమయానికి కనీసం అయిదు లక్షల రూపాయల విరాళాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ అసోసియేషన్ ను సైతం ఏర్పాటు చేసుకోవడం మతసామరస్యాన్ని చాటుతోంది. బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నట్లుగా వార్తలు వస్తోన్న అస్సాంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాణాసంచా కాల్చి..
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలవడించిన తీర్పు పట్ల అస్సామీ ముస్లింలో హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచాను కాల్చి, తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. అక్కడితో ఆగలేదు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అయిదు లక్షల రూపాయలను విరాళం ఇస్తామని ప్రకటించారు. దీనికోసం ఇప్పటి నుంచే పొదుపు చేయడం ఆరంభిస్తామని వెల్లడించారు. రామమందిరం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే సమయానికి అయిదు లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
అసోసియేషన్ ఏర్పాటు..
రూపాయి, రూపాయిని పోగు చేయడానికి వారు ప్రత్యేకంగా ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. దీని పేరు జొనొగుస్తియా సొమొనోయ్ పరిషద్ అసోం (జేఎస్పీఏ). మొత్తం 21 ముస్లిం సంఘాలు కలిసి ఈ అసోసియేషన్ ను ఏర్పాటు చేశాయి. ఈ 21 ముస్లిం సంఘాల్లో ఉన్న వారంతా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారం చేసే ముస్లింలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వారంతా కలిసి కనీసం అయిదు లక్షల రూపాయలను పోగు చేసి, రామమందిరం ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నారు.
మత సామరస్యానికి నిదర్శనం..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే గువాహటిలోని సదత్ గంజ్ ఏరియాలో నివసించే ముస్లిం కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచాను కాల్చి వేడుక చేసుకున్నారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావాలని తాము ప్రార్థనలు చేశామని చెబుతున్నారు. శతాబ్దాల నాటి ఈ వివాదం ముగియడం ప్రజాస్వామ్యానికి చాలా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల హిందు, ముస్లింల మధ్య సోదర భావం మరింత పెరుగుతుందని అంటున్నారు. అయోధ్యపై తీర్పు బాబ్రీ మసీదుకు ప్రతికూలంగా వెలువడినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్త లేదని, మతాలకు అతీతంగా భారతీయులందరూ శాంతిని కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని జేఎస్పీఏ ఛైర్మన్ సయ్యద్ ముమినుల్ అవోవల్ చెప్పారు.
హర్షం వ్యక్తం చేసిన డెమొక్రటిక్ ఫ్రంట్..
సుప్రీంకోర్టు తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా రావడం మెజారిటీ ప్రజలను మనోభావాలను గౌరవించినట్లయిందని అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య వేదిక (ఏఐయూడీఎఫ్) చీఫ్, లోక్ సభ సభ్యుడు బద్రుద్దిన్ అజ్మల్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై పున: సమీక్ష కోరాలని నిర్ణయించుకున్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం తన మనస్సును మార్చుకోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు. వీలైనంత త్వరగా రామమందిరం నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.