మోడీ పర్యటన: అస్సాంలో పేలుడు, మహిళ మృతి
గౌహతి: అస్సాంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా నలుగురుకి గాయాలయ్యాయి. దిపు జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద ఈ పేలుడు సంభవించింది.
మృతి చెందిన మహిళ తుని బేగంగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అస్సాం పర్యటనలో మోడీ
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అస్సాంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పేలుడు ఘటన జరగడం గమనార్హం. కోక్రఝరిలో ప్రధాని మంగళవారం ఉదయం ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడారు.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోక్రాఝార్కి ఏడాదిలోగా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు రూటును పొడిగిస్తామన్నారు. తొందరలోనే భారత వైమానిక దళం, పౌరులు వాడుకునేందుకు వీలుగా అక్కడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
గత పదిహేనేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. వారు అంత కాలంలో చేయలేని పనిని తాము 15 నెలల్లో చేసి చూపించామని చెప్పారు. అస్సాం కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక పథకం ‘అభివృద్ధి' అని పేర్కొన్నారు. అక్కడ రోడ్డు, రైలు, వాయు మార్గాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులనుద్దేశించి
రానున్న కాలంలో ప్రపంచానికి భారీస్థాయిలో మానవ వనరులు అవసరమవుతాయని, దీనికోసం భారతీయ యువత సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. గౌహతి పర్యటనలో ఉన్న మోడీ.. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ... భారత్ మాత్రం వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. దేశంలో 65శాతం 35ఏళ్లలోపు ఉన్నవారేనని.. వీరి నైపుణ్యాభివృద్ధి కోసం తొలిసారి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.