వృద్ధుడి ఇంట్లో రూ.1.55కోట్లు: అన్నీ కొత్త నోట్లే!
85 ఏళ్ల వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త ఇంట్లో అసోం పోలీసులు కోటిన్నర రూపాయల విలువ చేసే కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
గౌహతి: పెద్దనోట్ల రద్దు తర్వాత అక్రమ మార్గాల్లో తరలుతున్న కొత్త నోట్లను ఎప్పటికప్పుడు పట్టెస్తున్నారు అధికారులు. తాజాగా, 85 ఏళ్ల వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త ఇంట్లో అసోం పోలీసులు కోటిన్నర రూపాయల విలువ చేసే కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అద్దెల మీద మాత్రమే ఆధారపడి బతికే ఈయన వద్ద ఇంత మొత్తం ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈయనకు గతంలో హోటల్ వ్యాపారం ఉండేది.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. గౌహతి నగరానికి చెందిన బెల్టోడా ప్రాంతంలోని హర్దీప్ సింగ్ బేదీ ఇంట్లో సోదాలు చేశారు. కొత్త 500, 2000 రూపాయల నోట్లలో మొత్తం రూ. 1,54,81,000 నగదు లభ్యమైందన్నారు.
అందులో 75వేల రూపాయలకు కొత్త 500 నోట్లు ఉండగా, మిగిలినవి 2వేల రూపాయల నోట్లు. ఈ మొత్తాన్ని పోలీసులు ఈ కేసును ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ పి బోరా కేసు విచారిస్తున్నారు.