రేపే ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల: అస్సాంలో ఉద్రిక్తత, కట్టుదిట్టమైన భద్రత
గువహటి: అస్సాం(అసోం) రాష్ట్ర పౌరుల తుది జాబితా శనివారం ఉదయం విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధానితోపాటు కొన్ని సంక్లిష్ట ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు.
అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతున్నారా.. సైబర్ క్రిమినల్స్ వలకు చేపల్లా చిక్కుతున్నారా?
రేపటితో ముగియనున్న గడువు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసోం ప్రభుత్వం చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్ఆర్సీ) కార్యక్రమం ఆగస్టు 31తో ముగియనుంది. అసోంలో నివసిస్తూ.. ఎన్ఆర్సీలో పేరు లేనివారిని ఇకపై విదేశీయులుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు గానీ, వ్యక్తులు గానీ విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇది ఇలావుంటే, గత సంవత్సరం జులై ముగిసిన ఎన్ఆర్సీ జాబితాలో 40 లక్షల మంది పేర్లు నమోదుకు నోచుకోలేదు.
41లక్షలమంది పేర్లు నమోదుకు నోచుకోలేదు..
గత ఏడాది జులైలో విడుదల చేసిన జాబితాలో 40,07,707మంది పేర్లు నమోదు కాలేదు. 3,29,91,384 మంది నుంచి దరఖాస్తులు రాగా.. అందులో 2,89,83,677మందిని జాబితాలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్లో 1,02,462మందిని జాబితాలోకి తీసుకున్నారు. ఇంకా 41,10,169మందికి జాబితాలో చోటు దక్కలేదు. దీంతో లక్షలాది మంది ప్రజలు తాము ఇక్కడివారిమేనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము దశబ్దాలుగా రాష్ట్రంలోనే ఉంటున్నప్పటికీ తమ పేర్లు జాబితాలో రాలేదని వాపోతున్నారు. తమ తాతలు, తండ్రులు కూడా ఇక్కడివారేనని.. తమ పేర్లు మాత్రం ఈ జాబితాలో లేవని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రేపు పేర్లను చూసుకోవచ్చు..
ఇది ఇలావుంటే, వలసవాదులంతా రాష్ట్రంలో చేరుతుంటే తమకు అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శనివారం విడుదల కానున్న జాబితాలో కూడా పేరు లేని వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది. శనివారం 10గంటలకు ఎన్ఆర్ సీ జాబితా విడుదల కానుంది. రాష్ట్ర పౌరులు తమ పేర్లను ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేనివారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలకు వెళ్లి జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవచ్చునని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. అస్సాంలోకి బంగ్లాదేశ్ తోపాటు ఇతర దేశాల నుంచి వలసలు పెరిగిపోతుండటంతో 1951 నుంచి జాతీయ పౌరసత్వ జాబితాను నిర్వహిస్తోంది.