మోడీ ఎన్ఆర్సీ: మమతాకు ఊహించని షాక్, మీకేం తెలుసు.. సొంత పార్టీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. అసోం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షులు ద్విపేన్ పాఠక్ ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు.
అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో అక్రమాలు జరిగాయని మమత ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె తీరుతో అసోంకు భారీ నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ద్విపేన్ పాఠక్ రాజీనామా సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జీ తీరును ఆక్షేపించారు.
మమతకు ఇక్కడేం జరుగుతుందో తెలియదు
ఎన్ఆర్సీపై మమత చేస్తున్న ఆరోపణలు సరికాదని ద్విపేన్ పాఠక్ చెప్పారు. అసోంలో క్షేత్ర స్థాయి వాస్తవాలు ఆమెకు తెలియవని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాష్ట్రానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని చెప్పారు. టీఎంసీ విభజన రాజకీయాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అసోంను విభజించేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Recommended Video
మమత వ్యాఖ్యలతో ఏకీభవించను
బెంగాలీలను అసోం నుంచి తరిమి వేయడానికి ఎన్ఆర్సీ తీసుకు వచ్చినట్లు మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారని, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని ద్విపేన్ తేల్చి చెప్పారు. ఆమె ఆరోపణలతో తాను ఏకీభవించనని చెప్పారు. ఇటువంటి ఆరోపణల వల్ల రాష్ట్రంలో అలజడి చెలరేగవచ్చునని, టీఎంసీ అధ్యక్షుడిగా ఉన్న తనపై నిందలు రావచ్చునని, అందుకే తన పదవికి రాజీనామా చేశానన్నారు. కాగా, ఎన్ఆర్సీ విషయంలో మమత తీవ్రవ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుబట్టింది.
బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం
ఇదిలా ఉండగా, ఎన్ఆర్సీపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ అంశం వల్ల బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ముసాయిదా ఎన్ఆర్సీలో చేర్చని 40లక్షల మందిలో కేవలం ఒక శాతం మందే చొరబాటుదారులు కావొచ్చునని, కానీ ప్రజలను చొరబాటుదారుల పేరుతో వేధిస్తున్నారన్నారు. బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశం కాదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్థాన్ నుంచి చాలామంది ప్రజలు గుజరాత్, రాజస్థాన్, యూపీ, పంజాబ్కు వచ్చారని, బంగ్లాదేశ్ నుంచి కూడా త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఇంకా చాలా రాష్ట్రాలకు వచ్చారని, వారు చొరబాటుదారులో, ఉగ్రవాదులో కాదు. బంగ్లాదేశ్ మాట్లాడేవారంతా బంగ్లాదేశీయులని కేంద్రం అనుకుంటోందన్నారు.
నన్ను అరెస్టు చేస్తారా చూస్తా
మరోవైపు, అసోంలో ప్రకటించిన ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని మమతా బెనర్జీ ప్రతిపక్షాలను కలుస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల విషయంలోనూ ఎన్ఆర్సీని అమలు చేయాలనే డిమాండుతో ఈ నెల 11న కోల్కతాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లోనూ అసోం తరహా ఎన్ఆర్సీ వెలువరించాలన్న డిమాండును వచ్చే ఎన్నికల్లో అంశంగా మార్చుతామని బీజేపీ చెబుతోంది. బెంగాల్లో దాదాపు కోటి మంది అక్రమ వలసదారులు ఉన్నారని, అందువల్ల ఇక్కడ కూడా ఎన్ఆర్సీ రూపొందించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గియా అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీన్ని రూపొందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దిలీప్ ఘోష్ ప్రకటించారు. తాను ఈ నెల 11న బెంగాల్ వస్తున్నానని, తనను అరెస్టు చేయాలని అమిత్ షా ఆమెకు సవాల్ విసిరారు. పోలీసులు ఆయన ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో రాజకీయం వేడెక్కింది.