రాష్ట్రపతి కార్యాలయంపై దౌర్జన్యమా?: ‘మహా’ బీజేపీ తీరుపై చిదంబరం ఫైర్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో గత శనివారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారంపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్తో భేటీ తర్వాత మారిన సీన్
చిదంబరం తన కుటుంబసభ్యుల ద్వారా ట్విట్టర్ వేదికగా బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేసేందుకు రాష్ట్రపతి కార్యాలయంపై దౌర్జన్యం చేశారంటూ చిదంబరం మండిపడ్డారు.
2019 రాజ్యాంగ దినోత్సవం మహారాష్ట్రలో నవంబర్ 23 నుంచి నవంబర్ 26 వరకు జరిగిన రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలనే గుర్తు చేస్తుందని అన్నారు. తెల్లవారుజామున 4 గంటలకే రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు సంతకం కోసం రాష్ట్రపతి కార్యాలయంపై దౌర్జన్యం చేశారని, ఉదయం 9గంటల వరకు ఎందుకు ఆగలేకపోయారని చిదంబరం బీజేపీని ప్రశ్నించారు.
కస్టడీ పొడిగించిన కోర్టు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. ఐఎన్ఎక్స్ మీడియాలో మనీ లాండరింగ్ కేసుపై విచారణ కొనసాగిస్తోన్న ఢిల్లీలోని రోజ్ వ్యాలీ ప్రత్యేక న్యాయస్థానం చిదంబరం కస్టడీని పొడిగింది. డిసెంబర్ 11వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారుల కస్టడీలో ఉంటోన్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. రోజ్ వ్యాలీ న్యాయస్థానం ఇదివరకు ఇచ్చిన కస్టడీ బుధవారం నాటితో ముగిసింది. దీనితో ఈడీ అధికారులు చిదంబరాన్ని ఈ మధ్యాహ్నం న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. కస్డడీని పొడిగించాలని కోరారు. అదే సమయంలో- చిదంబరం తరఫు న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తును దాఖలు చేశారు. 99 రోజులుగా చిదంబరం కారాగారంలో ఉంటున్నారని, ఇన్ని రోజులైనప్పటికీ..చిదంబరాన్ని దోషిగా నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సేకరించలేకపోయారని అన్నారు.
ఇదే ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ వ్యవహారంలో చిదంబరంపై సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చిదంబరం పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల బెయిల్ ఇస్తే.. సాక్ష్యాధారాలను, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. తమ విచారణ ఇంకా ముగియలేదని, చిదంబరం నుంచి మరిన్ని కీలకమైన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని వెల్లడించారు.