ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?, యూపీలో బీజేపీ ఇలా...: తిరుగులేని మోడీ
అయిదు రాష్ట్రాల ఎన్నికల తుది ఫలితాలు వచ్చాయి. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 202. బీజేపీ 325 స్థానాలతో విజయ దుందుభి మోగించింది.
లక్నో: అయిదు రాష్ట్రాల ఎన్నికల తుది ఫలితాలు వచ్చాయి. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 202. బీజేపీ 325 స్థానాలతో విజయ దుందుభి మోగించింది. ఎస్పీ - కాంగ్రెస్ 54 స్థానాలు, బీఎస్పీ 19 స్థానాలు గెలుపొందింది. ఇతరులు ఐదు స్థానాలు దక్కించుకున్నారు.
117 స్థానాలు ఉన్న పంజాబ్లో కాంగ్రెస్ 77, బీజేపీ-అకాలీదళ్ 18, ఏఏపీ 20, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఉత్తరాఖండ్లో 70 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 57, కాంగ్రెస్ 11, ఇతరులు రెండు స్థానాలు దక్కించుకున్నారు.
గోవాలో 40 స్థానాలు ఉండగా బీజేపీ 13, కాంగ్రెస్ 17, ఇతరులు 10 స్థానాల్లో గెలిచారు. మణిపూర్లో 60 స్థానాలకు గాను బీజేపీ 21, కాంగ్రెస్ 28, ఎన్పీఎఫ్ 4, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు.
తిరుగులేని నేతగా మోడీ..
2014లో బీజేపీని మోడీయే గెలిపించారు. ముప్పై ఏళ్ల తర్వాత లోకసభలో ఒంటరిగా ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రావడం 2014లోనే. అది మోడీకే సాధ్యమైంది. ఆ తర్వాత నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజలు ఇబ్బంది పడ్డా ఆయనను నమ్మారు. పేదలు, దేశం కోసమే ఆయన అడుగులు ఉన్నాయని భావించి ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. 2014లో ఏ విధంగా దూసుకు వచ్చారో.. ఇప్పుడు పాలనలో అదే దూకుడు చూపిస్తూ.. తిరుగులేని నేతగా మోడీ ఎదిగారు.
యూపీలో ఇలా..
యూపీలో బీజేపీ 325 స్థానాలతో అద్భుత విజయం సాధించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ స్థాయి మెజార్టీ వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కమలం వికసించింది.
అవధ్లో కమల వికాసం
రాష్ట్రంలో మొత్తం అయిదు ప్రాంతాలున్నాయి. అవధ్లో 137 స్థానాలుండగా బీజేపీ 112 స్థానాల్లో గెలిచింది. రాజధాని లక్నో ఇదే ప్రాంతంలో ఉంది. దాదాపు 81.75 శాతం విజయం లభించింది.
బుందేల్ఖండ్లో మొత్తం
రాష్ట్రంలో, దేశంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ 19 సీట్లు ఉండగా బీజేపీ మొత్తం స్థానాలను గెలుచుకుంది.
పూర్వాంచల్
ఉత్తర్ప్రదేశ్లోని తూర్పు ప్రాంతాలను పూర్వాంచల్ అంటారు. వారణాసి ప్రధాన నగరం. అభివృద్ధి అంతంత మాత్రమే. మొత్తం 98 స్థానాలుంటే 74 స్థానాలను బీజేపీ కైవశం చేసుకొంది.
రోహిల్ఖండ్
రోహిల్ఖండ్ ప్రాంతంలో 48 సీట్లు ఉన్నాయి. బీజేపీ 36 స్థానాలను గెలుచుకుంది.
పశ్చిమ ఉత్తర ప్రదేశ్
రాష్ట్రంలో వ్యవసాయకంగా అభివృద్ధి చెందిన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీకి జాట్లు ప్రధాన మద్దతుదారులుగా మారడంతో అనూహ్యమైన విజయాలను సాధించింది. మొత్తం 101 స్థానాలుండగా 84 స్థానాల్లో గెలుపొందింది.
దశల వారీగా..*
యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అన్ని దశల్లోనూ బీజేపీ జోరు కొనసాగింది. మొదటి దశలో మొత్తం 73 స్థానాల్లో పోలింగ్ నిర్వహించగా 66 స్థానాల్లో, రెండో దశలో 67 స్థానాల్లో ఎన్నిక నిర్వహించగా 50 సీట్లలో, మూడో దశలో 69 స్థానాల్లో 55 సీట్లలో, నాలుగో దశలో 53 సీట్లకు ఎన్నికలు జరగ్గా 44 స్థానాల్లో, అయిదో దశలో 52 సీట్లలో 45 సీట్లలో, ఆరో దశలో 49 స్థానాలకు 33 స్థానాలలో, ఏడోదశలో 40 స్థానాలుండగా బీజేపీ 32 సీట్లను తన ఖాతాలో వేసుకుంది.