ఎన్నికల ఫలితాల వేళ.. విదేశంలో సోనియాగాంధీ! అసలేమైంది?
ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ (శనివారం) తేదీన వెల్లడికానుండగా, ఓట్ల లెక్కింపు సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలో ఉండడం లేదు.
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ (శనివారం) తేదీన వెల్లడికానుండగా, ఓట్ల లెక్కింపు సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలో ఉండడం లేదు.
అనారోగ్య కారణాల వల్ల వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం సోనియా గత మంగళవారమే విదేశాలకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. ఆమె ఈనెల 22వ తేదీన తిరిగి రానున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రచారంలో వారణాసి రోడ్ షోలో పాల్గొన్న సోనియా అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీలో చికిత్స తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆమె సరిగ్గా హాజరుకావడం లేదు.
అనారోగ్యంతో గతంలో అమెరికాలో చికిత్స చేయించుకున్న సోనియాగాంధీ ప్రస్తుతం యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. సోనియా తరుపున ఆమె కుమారుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఎంపీలతో రాహుల్ రేపు సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. 11న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో గనక కాంగ్రెస్ ఓటమి చవిచూస్తే.. రాహుల్ గాంధీ నాయకత్వంపై మరోమారు ప్రశ్నలు తలెత్తే అవకాశముంది. అదేగనుక జరిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధి కోసం ప్రియాంకగాంధీ నడుం బిగించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.