మూడురోజుల్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల భేరీ! మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలే!
న్యూఢిల్లీ: మరో మూడు రోజులు. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ, అందలం ఎక్కడానికి ప్రతిపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తలపడబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే విషయం ఈ ఏడాది డిసెంబర్ నాటికి తేలిపోతుంది.
వైఎస్ఆర్ పెళ్లి కానుక.. రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపు
తొలుత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండుచోట్ల పోలింగ్ ముగిసిన తరువాత జార్ఖండ్ లో ఎన్నికలను నిర్వహిస్తారని ప్రాథమికంగా అందిన సమాచారం. జార్ఖండ్ లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్నందున దశలవారీగా అక్కడ పోలింగ్ ను ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు నుంచి అయిదు దశల్లో ఎన్నికలను చేపట్టవచ్చని అంటున్నారు. 2014లోనే ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ పోలింగ్ ను నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ అధికారాన్ని అందుకుంది.
289 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ, దాని మిత్రపక్షాలకు 122 సభ్యుల బలం ఉంది. శివసేన 63, కాంగ్రెస్-42, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-41, మజ్లిస్-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధికారంంలో ఉంది. మొత్తం 90 స్థానాలు హర్యానా అసెంబ్లీలో బీజేపీ, దాని మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ కలుపుకొని 49 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో ఒక్క బీజేపీకే 48 మంది సభ్యులు ఉన్నారు. 17 స్థానాలతో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. మరో ఏడింటిని కాంగ్రెస్ మిత్రపక్షం ఇండియన్ నేషనల్ లోక్ దళ్ గెలుచుకుంది. అలాగే- 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ, దాని మిత్రపక్షానికి 46 సభ్యుల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాజు ఎవరో, బంటు ఎవరో తేలిపోతుంది.