ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనం- వెయ్యి కోట్ల నగదు, గిఫ్ట్లు సీజ్-దేశంలో తొలిసారి
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పెను సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఇతర విపక్షాల మధ్య నెలకొన్న పోటీతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో నగదు, ఉచితాలు, మద్యం, బంగారం, డ్రగ్స్ పంపిణీతో ఓటర్లను లోబర్చుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో రికార్డు స్దాయిలో ఓటర్లకు పంచేందుకు సిద్దం చేసిన వెయ్యికోట్ల విలువైన నగదు, ఇతర సామాగ్రిని ఈసీ స్వాధీనం చేసుకుంది.
ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీ
దేశంలో రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి ఆ తర్వాత పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. వీటి గాయాలు మానకముందే మరోసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఈ ఐదు చోట్లా ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో బీజేపీ సర్వశక్తులొడ్డుతోంది. అదే సమయంలో బీజేపీని తమ రాష్ట్రాల్లో పాగా వేయనీయకుండా అడ్డుకునేందుకు బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు వంటి చోట్ల విపక్షాలు గట్టిగా పోరాడుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాస్తా సార్వత్రిక సంగ్రామంగా మారిపోతున్నాయి.
ప్రలోభాల్లో పార్టీల మధ్య తీవ్ర పోటీ
ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు కీలకంగా మారిపోయిందో అప్పుడు ప్రలోభాల పర్వం కూడా పతాక స్దాయికి చేరిపోయింది. పలు చోట్ల అధికార బలంతో మరికొన్ని చోట్ల ఉచితాల ఎరతో, ఇంకొన్ని చోట్ల నగదు, మద్యంతో.. ఇలా అందిన కాడికి ఓట్లను సాధించేందుకు పార్టీలు బరితెగిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల ప్రలోభాల పర్వం రికార్డులు తిరగరాస్తోంది. ముఖ్యంగా బెంగాల్, అస్సోంలో పరిస్ధితి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఉందన్న నివేదికలు వెలువడుతున్నాయి.
రికార్డు స్దాయిలో వెయ్యి కోట్ల ప్రలోభాల సీజ్
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్దం చేసిన వెయ్యికోట్ల ప్రలోభాలను సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఇందులో నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, చీరాసారెలు కూడా ఉన్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్, అస్సోంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వీటిని సిద్దం చేసినట్లు ఈసీ తెలిపింది. పక్కా సమాచారంతో వీటిని స్వాధీనం చేసుకుంది. దీంతో అభ్యర్దులు, పార్టీలు లబోదిబోమంటున్నాయి.
ప్రలోభాల్లో తమిళనాడు టాప్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈసీ పట్టుకున్న నగదు, ఇతర సామాగ్రి విలువే వెయ్యి కోట్లు ఉందంటే ఇంకా ఈసీకి దొరక్కుండా పంచుతున్న వాటి విలువ ఇంకెంత ఉందో అన్న చర్చ సాగుతోంది. ఈసీ పట్టుకున్న వాటిలో అత్యధికంగా తమిళనాడులోనే రూ.446 కోట్ల విలువైన నగదు, ఇతర సామాగ్రి ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో రూ.300 కోట్లతో బెంగాల్, రూ.122 కోట్లతో అస్సోం, రూ.84 కోట్లతో కేరళ, రూ.36 కోట్లతో పుదుచ్చేరి ఉన్నాయి. 2016లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం రూ.225 కోట్లు మాత్రమే పట్టుకోగా.. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి కోట్లు దాటిపోవడం విశేషం. తాజాగా జరుగుతున్న తిరుపతి, సాగర్ సహా పలు ఉపఎన్నికల్లో రూ.10 కోట్ల నగదును ఈసీ స్వాధీనం చేసుకుంది.
Recommended Video