నేడే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
Recommended Video
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత-బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను మరింత పెంచారు.
శనివారం ఉదయం 8 గంటలకు కౌటింగ్ మొదలు కానుంది. మూడు రాష్ట్రాల్లోనూ జెండా ఎగురవేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసినా.. త్రిపురలో వామపక్షాలు, మేఘాలయలో కాంగ్రెస్ మాత్రం తమ అధికారం కొనసాగిస్తామని ధీమాగా ఉన్నాయి.
త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్లలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే, వేర్వేరు కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్ జరిగింది.
మేఘాలయలో గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారంలోకి వస్తే ముచ్చటగా మూడోసారి మేఘాలయను పాలించనున్నది. అటు నాగాలాండ్లో 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ అధికారంలో ఉంది. 2008లో ఇక్కడ రాజకీయ సంక్షోభం కారణంగా మూడు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఎన్ఎఫ్పీనే అధికారంలోకి వచ్చింది.
ఇక త్రిపురలోలెఫ్ట్ ఫ్రంట్ గత 25 ఏళ్లుగా సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమే అధికారంలో ఉంది. ఈసారి కూడా తమదే అధికారమని లెఫ్ట్ ఫ్రంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాయి.
త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ కంచుకోటను బీజేపీ బద్దలు కొడుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అటు నాగాలాండ్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి గెలిచే అవకాశాలున్నాయని, మేఘాలయలో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే మేఘాలయలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశముంది.