అటు అసెంబ్లీ ఎన్నికలు..ఇటు ఉల్లి ధరల ఘాటు: కమలనాథుల్లో కలవరం
న్యూఢిల్లీ: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల విషయంలో ఇది తలకిందులవుతోంది. మేలు సంగతి పక్కన పెడితే.. అందలాన్ని అందకుండా చేస్తోంది. రెండు కీలక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలనాథులు ఎన్నికలకు సమాయాత్తమౌతున్న వేళ.. ఉల్లి ధరల ఘాటు వారి నషాళాన్ని అంటుతోంది. ఇప్పటిదాకా వేసుకున్న వ్యూహాలను తుత్తునీయలు చేస్తోంది. నెల రోజుల కిందట ఉన్న ధరలతో పోల్చి చూస్తే ఉల్లి పాయల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఉల్లి పాయలను కొనలేని పరిస్థితి ఏర్పడింది మధ్య తరగతి జీవుడికి. వారి నుంచి నిరసన ఎదురవుతోంది కమలనాథులకు.
అటు రైతులు.. ఇటు కొనుగోలు దారుడు..
ఉల్లి ధరల తగ్గింపు విషయంలో ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది కమల నాథుల పరిస్థితి. ఉల్లి ధరలను నియంత్రించాల్సి వస్తే.. రైతుల నుంచి వ్యతిరేకత, వారిని దృష్టిలో ఉంచుకుని ధరలను అదుపు చేయకపోతే కొనుగోలుదారుల నుంచి ప్రతిఘటన. దీంట్లో ఎవరి వైపు మొగ్గు చూపాలో తెలియక తికమక పడుతోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్. ఉల్లి పాయల ధరలను నియంత్రించడానికి వాటి ఎగుమతులపై నిషేధం విధించినా.. దీని వల్ల కలిగే ప్రభావం పెద్దగా సామన్య జనంపై పడట్లేదనేది ధరలను బట్టి చూస్తే తెలిసిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత..
నిజానికి- ఉల్లి ధరల దెబ్బ ఎలా ఉంటుందనేది బీజేపీకి తెలిసినంతగా మరో పార్టీకి తెలియకపోవచ్చు. ఉల్లి ధరలను నియంత్రించకపోవడం వల్ల చేతికి అందిన అధికారాన్ని కోల్పోయిన అనుభవం బీజేపీకి ఉంది. గతంలో సుష్మా స్వరాజ్ సారథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. కేవలం ఉల్లి ధరల పెరుగుదల వల్లే అధికారాన్ని కోల్పోయిందనే విషయం తెలిసిందే. బీజేపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగారు. ఈ అంశం వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది.
వ్యూహాలు తారుమారు..
మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ నిన్నటి దాకా అధికారంలో ఉన్నది బీజేపీయే. తమ హయాంలో చేసిన పనులు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక అంశాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. ఎన్నికల బరిలో దిగింది. మరోసారి అధికారాన్ని అందుకోవడం ఖాయమనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న బీజేపీ నాయకులు ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి ఉల్లి ధరలు. ప్రచారంలో భాగంగా.. ఎక్కడికి వెళ్లినా ఉల్లి ధరల సెగ వారికి తగులుతోంది.
అంచనాలు తారుమారవుతాయనే ఆందోళన..
అప్పటిదాకా రూపొందించిన వ్యూహాలు, కసరత్తులను పక్కన పెట్టి, ఉల్లి ధరల నియంత్రణపై సమాధానాన్ని ఇచ్చుకోవాల్సి వస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలపై ఏకరువు పెట్టడాన్ని ఆస్వాదించట్లేదు, హర్షించట్లేదు సామన్య ప్రజలు. ఉల్లి ధరల రేట్ల గురించి నిలదీస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అంచనాలు తారుమారవుతాయనే భయం వారిలో నెలకొంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వాటి ఎగుమతులను నిషేధించిందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ.. దాని వల్ల పెద్దగా ప్రభావం కనిపించట్లేదని అంటున్నారు కమలనాథులు.
ప్రతిపక్షాలకు అనుకోని అస్త్రం..
ఉల్లి ధరల పెరుగుదల ప్రతిపక్ష పార్టీలనూ అయాచిత అస్త్రంగా దొరికిందనేది అంగీకరించాల్సిన వాస్తవం. బీజేపీ మీద ఎదురు దాడి చేయడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ.. ఉల్లి ధరల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీనికితోడు దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక స్థితిగతులు, మోడీ సర్కార్ సారథ్యంలో నెలకొన్న ఆర్థిక దుస్థితిని బేరీజు వేస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదల అంశాన్ని దీనికి జోడిస్తున్నారు.