హత్రాస్ మృతురాలి తండ్రి భిన్న స్వరం: నిరసనలు, ఆందోళనలు ఎందుకు, అవసరం లేదు..
హత్రాస్ దళిత మహిళపై లైంగికదాడి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కదం తొక్కారు. వారిని పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే మృతురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనపై జరుగుతోన్న విచారణపై తనకు నమ్మకం ఉంది అని చేసిన వ్యాఖ్యలతో.. విపక్ష కాంగ్రెస్ డిఫెన్స్లో పడింది.
దళితులుగా పుట్టడమే పాపమా..? పిల్లలను తీసుకొని ఎటైనా వెళ్లాలా.. హత్రాస్ అట్టడుగు వర్గాల రోదన..
మృతురాలి తండ్రి వాదన ఇలా..
తీవ్రగాయాలతో యువతి చనిపోగా.. అర్ధరాత్రి 2.45 గంటలకు పోలీసులు బలవంతంగా దహన సంస్కారాలు నిర్వహించారు. దీనిపై వివాదం నడుస్తోండగా.. రాహుల్, ప్రియాంక పరామర్శించేందుకు బయల్దేరారు. అయితే మృతురాలి తండ్రి మాత్రం.. విచారణపై తనకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు. తాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన సందేహాలను లేవనెత్తానని తెలిపారు. తమ కూతురికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇదే విషయాన్ని వీడియో కాల్లో యోగి చెప్పారని తెలిపారు.
పూర్తి విశ్వాసం ఉంది..
సీఎం యోగి ఇచ్చిన హామీతో తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఘటనపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రహదారిపై కూర్చొని ఆందోళనలు/ ధర్నా చేయడం వృథా ప్రయాస అవుతుందని తెలిపారు.
సిట్, ఫాస్ట్రాక్ కోర్టు
హత్రాస్ ఘటనపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యోగి సర్కార్ స్పందించింది. యువతిపై లైంగికదాడి ఘటనపై ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు వారంలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. ఆ తర్వాత విచారణ కోసం ఫాస్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. దీంతో వేగంగా విచారణ జరిగి.. నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తుంటే.. మృతురాలి తండ్రి చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి.