ముఖ్యమంత్రి రాజీనామా ఖాయం: సీఎంగా దళితుడికి ఛాన్స్!
బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పట్లో దీనికి బ్రేక్ పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటోన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. దీనిపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీంకోర్టు.. తన తీర్పును వాయిదా వేసింది. బుధవారం ఉదయం 10:30 తిరుగుబాటు ఎమ్మెల్మేల రాజీనామాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వబోతోంది.
వీడియో: టీమిండియా ఓడిపోవాలంటూ బెజవాడ పాస్టర్ ప్రార్ధనలు? జీసస్ అనుగ్రహించాడా?
ఇదిలావుండగా- కర్ణాటకలో అధికార మార్పిడి తప్పదని ప్రముఖ జ్యోతిష్యుడు అమ్మణ్ణయ్య వెల్లడించారు. చంద్రగ్రహణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయడానికి 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆయన స్థానంలో ఓ దళిత నాయకుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠిస్తారని అమ్మణ్ణయ్య తెలిపారు.
మంగళవారం ఉదయం ఆయన కర్ణాటకలోని ఉడుపిలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. తన అంచనాలను వెల్లడించారు. ఆ దళిత నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. భారతీయ జనతాపార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోవడం కష్టతరమేనని తన జ్యోతిష్య అధ్యయనం తేలిందని అన్నారు. ఆయన మాస్ లీడర్ అయినప్పటికీ.. గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేరని తెలిపారు.
సమీప భవిష్యత్తులో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా లేదని అనుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని వెల్లడించడానికి అమ్మణ్ణయ్య నిరాకరించారు. దీనిపై స్పష్టత లేదని పేర్కొన్నారు. బీజేపీ-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చని తాను అంచనా వేస్తున్నానని ఆయన తెలిపారు. బీజేపీ-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అది అయిదేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం ఇదే విషయాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.