క్రికెటర్ కావాలని, ఆర్మీలో చేరాలని: బుర్హన్వాని గురించి తండ్రి షాకింగ్ విషయాలు
శ్రీనగర్: భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వానీ తన పదేళ్ల వయస్సులో ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. ఆ తర్వాత క్రికెటర్ కావాలనుకున్నాడు. బుర్హన్ వానీ గురించిన పలు ఆసక్తికర విషయాలను అతని తండ్రి ముజఫర్ వని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
క్రికెటర్ కావాలని, సైన్యంలో చేరాలని
బుర్హాన్ వాని తాను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు సైన్యంలో చేరుతానని చెప్పాడని తెలిపాడు. అలాగే కాశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ లాగే తాను కూడా ఓ క్రికెటర్ కావాలని అనుకునేవాడని చెప్పాడు. ముజఫర్ వని ఓ గవర్నమెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
తన కుమారుడు బుర్హాన్ వాని తాను పాఠాలు చెబుతోన్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పేవాడినని తెలిపారు. పిల్లలకు చెప్పినట్లే తన కుమారుడు బుర్హాన్ వానీ కూడా అలాగే ఉండాలని అనుకొనే వాడినని చెప్పాడు.
బుర్హన్ వాని
బుర్హాన్ వానీ చనిపోయి ఇన్ని రోజులు కావస్తున్నా కాశ్మీర్లో ఆందోళనలు తగ్గుముఖం పట్టకపోవడానికి ఎవరు బాధ్యులని ముజఫర్ వానిని అడగ్గా.. హురియత్ కాన్ఫరెన్స్ ఎలాంటి బందుకు పిలుపు ఇవ్వలేదన్నారు. బుర్హాన్ వాని హతమైన తర్వాత నుంచి చెలరేగిన అల్లర్లతో తాము ఎంతో నష్టపోయామన్నారు.
భారత ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటూ అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తాను తన ఇద్దరు కుమారులను కోల్పోయానని చెప్పారు. కాశ్మీరులు ఇతరులు కూడా వారి కుటుంబ సభ్యులని కోల్పోయారన్నారు.
ఇరు దేశాలను ప్రేమిస్తారు
తమ కుమారుడి మరణం తర్వాతే భద్రతా దళాలని ఎదురిస్తూ కాశ్మీరి యువత ఆయుధాలు చేపట్టారా? అని ముజాఫర్ను అడిగితే అలాంటిదేమీ లేదన్నారు. వీరు పాకిస్థానీయులను, భారతీయులను సమానంగా ప్రేమిస్తారన్నారు.
యూరీ దాడిపై..
యూరీ దాడి గురించి మాట్లాడుతూ.. ఆ పని చేసింది హిందుస్థాన్లోని ముస్లిం లేదా కాశ్మీర్ మిలిటెంట్ల పని కావొచ్చన్నారు. కాశ్మీర్ సమస్యకు పరిష్కరం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ఇటీవల జరిగిన పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడి, యూరీ సైనిక శిబిరంపై దాడి వంటి ఘటనలు చోటు చేసుకోవచ్చన్నారు.
ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఎలా చేరుకుంటున్నారని, సైన్యం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దాడులకు కారణం జైషే సంస్థకు చెందిన వారేనని సాక్ష్యాలు ఉంటే విచారణ జరపాలన్నారు. తన కుమారుడు 2010 అక్టోబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు.
తీవ్రవాదుల్లో కలిశాడు
అనంతరం బుర్హాన్ వాని ఉగ్రవాదుల్లో కలిసిపోయినట్టు తనకు తెలిసిందన్నారు. ఈ విషయంపై తాను తన కుమారుడికి నచ్చచెప్పాలని ప్రయత్నించానని, తన కుమారుడిని చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం చూశానన్నారు.
జమ్మూ కాశ్మీర్ కోసమే బుర్హాన్ వాని పని చేశాడన్నారు. తన కుమారుడి మృతి తనకు ఎంతో బాధ కలిగిస్తోందని, భరించక తప్పదన్నారు. తన పెద్ద కుమారుడు ఖలీద్ ఈ ఏడాది ఏప్రిల్లో భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందాడన్నారు. ఆ తర్వాత బుర్హాన్ వానీ మృతి చెందాడన్నారు.
బుర్హాన్ వానిని కలుసుకునేందుకు తన పెద్ద కొడుకు ఖలీద్ వెళ్లినట్టు పోలీసులు భావించారని అందుకే కాల్పులు జరిపారన్నారు. ఖలీద్ ముగ్గురి స్నేహితులను పోలీసులు మొదట అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారన్నారు.