దూసుకెళ్తున్న టాల్గో.. రికార్డ్స్ బ్రేక్.. గంటకు 180 కి.మీ
న్యూఢిల్లీ : అధునాతన ఆవిష్కరణలు రైల్వే స్థితిగతులను మార్చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్త రైళ్లు భారతీయ పట్టాలపైకి దూసుకొస్తుండడంతో దూరాభారం తగ్గే వెసులుబాటు కలగబోతుంది. తాజాగా స్పెయిన్ కేంద్రంగా తయారైన టాల్గో రైలును దేశంలోని పట్టాలపై పరీక్షించగా గణనీయమైన వేగాన్ని అందుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటిదాకా గంటకు 160 కి.మీ స్పీడుతో దేశంలోనే వేగవంతమైన రైలుగా ఉన్న గతిమాన్ రికార్డ్ ను, తాజాగా టాల్గో బ్రేక్ చేసింది. బుధవారం నాడు నిర్వహించిన ట్రయల్ రన్ లో టాల్గో రైలు గంటకు 180 కి.మీ వేగాన్ని అందుకున్నట్టు ఆగ్రా డివిజినల్ మేనేజర్ ప్రభాష్ కుమార్ ప్రకటించారు.
తొలి ట్రయల్ రన్ లో భాగంగా.. మధుర-పాల్వాల్ రైల్వే మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించగా, టాల్గో రైలు 38 నిముషాల్లోనే 84 కి.మీ దూరం ప్రయాణించినట్టుగా అధికారులు చెబుతున్నారు. అత్యాధునికి సాంకేతికతో రూపొందించిన టాల్గో రైలు ట్రయల్ రన్ ను గత ఐదు రోజులుగా పరీక్షిస్తున్నారు రైల్వే అధికారులు.
తొలిరోజు ట్రయల్ రన్ ను 120 కి.మీ వేగంతో పరీక్షించిన అధికారులు.. తర్వాత రోజు నుంచి పది కి.మీ వేగాన్ని పెంచుతూ పోవాలని నిర్ణయించారు. అయితే టాల్గో రైలు స్పీడ్ ను త్వరగానే అందుకుంటుండడంతో మంగళవారం నాడే 170 కి.మీ వేగంతో రైలును పరీక్షించారు అధికారులు. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అవడంతో బుధవారం నాడు ఇక 180 కి.మీ వేగంతో రైలును పరీక్షించగా, టాల్గో రైలు విజయవంతంగా వేగాన్ని అందుకుంది.
టాల్గో వేగంపై సంతృప్తి ఏర్పడడంతో.. ఇకనుంచి నిర్వహించే ట్రయల్ రన్స్ లో ప్రయాణికుల బరువుకు సమానమైన ఇసుక బస్తాలను రైల్లో వేసి వేగాన్ని పరీక్షించనున్నారు అధికారులు. కాగా, ఈ ట్రయల్ రన్ మధుర-ముంబై మార్గంలో ఉండనున్నట్టు సమాచారం.
అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయితే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై మధ్య ఈ టాల్గో రైలును ప్రవేశపెట్టాలనే యోచనలో రైల్వే శాఖ ఉంది.