చలి పులి పంజా: 17 ఏళ్ల రికార్డు బద్దలు -రాజధానిలో జనం గజగజ -వైరస్ విజృంభణ -డేంజర్ బెల్స్
అంతా భయపడుతున్నట్లే జరుగుతోంది.. కరోనా వైరస్ విజృంభణకు చలికాలం మరింత ఆజ్యం పోస్తోంది. విపరీతమైన చలి కారణంగా దేశరాజధాని ఢిల్లీలో కొత్త కేసులు, మరణాల సంఖ్య మళ్లీ అమాంతం పెరిగాయి. తాజాగా 17 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ నవంబర్ నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం అందరినీ కలవరపెడుతున్నది. భారత వాతావరణ శాఖ, ఢిల్లీ ఆరోగ్య శాఖ చెప్పిన వివరాలివి..
ఢిల్లీలో ఆదివారం(నవంబర్ 22) ఉదయం 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ నెలలో ఇంత తక్కువ టెంపరేచర్ రావడం 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఎప్పుడో 2003లో నవంబర్ మాసంలో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం కరోనా విలయం కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలో తగ్గుదల గుబులుపుట్టిస్తున్నది.
కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్
కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి ఢిల్లీలో పలు రికార్డులు చెరిగిపోతున్నాయి. శుక్రవారం నమోదైన 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత.. గడిచిన 14 ఏళ్లలో నవంబర్ లో నమోదైన అత్యల్పంగా గుర్తించారు. రెండు రోజులు తిరిగేలోపే టెంపరేచర్ 6.9 డిగ్రీలకు పడిపోయి.. 17 ఏళ్ల రికార్డును చెరిపేసింది. హిమాలయాల నుంచి చల్లటి గాలులు బలంగా వీస్తుండటంతో ఢిల్లీలో ఈ పరిస్థితి నెలకొందని, రాబోయే రెండు మూడు రోజుల్లో కనిష్టం ఇంకా కిందికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
''2003లో సర్దాఫ్ గంజ్ వాతావరణ కేంద్రంలో 6.1 డిగ్రీలు నమోదుకావడమే నవంబర్ లో అత్యల్ప రికార్డు. 17 ఏళ్లకు మళ్లీ ఈ ఆదివారం 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది''అని వాతావరణ శాఖ ఢిల్లీ రీజియన్ అధికారి కుల్ దీప్ శ్రీవాస్తవ చెప్పారు. ఢిల్లీలో నవంబర్ నెలకు సంబంధించి గతేడాది(2019లో) కనిష్టంగా 11.5 డిగ్రీలు, 2018లో 10.5 డిగ్రీలు, అదే 2017లో 7.6 డిగ్రీలు నమోదైనట్లు ఆయన గుర్తుచేశారు. 82 ఏళ్ల కిందట(1938, నవంబర్ 28న) నమోదైన 3.9 డిగ్రీలు చరిత్రలోనే (నవంబర్) అత్యల్ప ఉష్ణోగ్రత.
కొవిడ్-19 షాకింగ్: రెమ్డెసివిర్ వాడొద్దు -పీక్యూ జాబితా నుంచి తొలగింపు -WHO కీలక ప్రకటన
Recommended Video
అసలే కరోనా కాలం, ఆపై చలి పెరుగుతుండటం ప్రభుత్వాలకు సవాలుగా, ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబర్ లోనూ 58 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రత (17.2 డిగ్రీలు) నమోదైంది. 1962 అక్టోబర్ లో 16.9 సెల్సియస్ రికార్డయింది. చలి పెరగడంతో దేశరాజధానిలో కరోనా కేసులు, మరణాలు కూడా పెరిగాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 5,879 కేసులు, 111 మరణాలు నమోదైనట్లు ఢిల్లీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.