దేవేగౌడ-రాహుల్ భేటీ: 10 లోక్ సభ స్థానాలు కావాలంటున్న జేడీఎస్: తేలని పొత్తు
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రాంతీయ, జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కర్ణాటకలో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం దేశ రాజధానిలో జనతాదళ్ (ఎస్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవేగౌడతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కర్ణాటకలో లోక్ సభ స్థానాల కేటాయింపులు ప్రధానంగా ఈ ఇద్దరు నేతల మధ్య కొనసాగింది.
10 స్థానాలు కావాల్సిందేనంటోన్న జేడీఎస్
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో పదింటిని తమకు కేటాయించాలని జేడీఎస్ పట్టుబట్టుతోంది. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా కూడా దేవేగౌడ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అవి కూడా తాము సూచించిన నియోజకవర్గాలే కావాలని దేవేగౌడ డిమాండ్ చేశారు. మండ్య, మైసూరు, హాసన, చిక్ బళ్లాపుర, తుంకూరు, కోలార్ లతో పాటు కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని స్థానాలనే ఇవ్వాలని జేడీఎస్ చీఫ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కీలక నేతల స్థానాలపై కన్ను
కాంగ్రెస్ లో వీరప్ప మొయిలీ, కేహెచ్ మునియప్ప వంటి కీలక నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలపై జేడీఎస్ కన్నేసినట్లు చెబుతున్నారు. చిక్ బళ్లాపురా లోక్ సభ నియోజకవర్గం నుంచి వీరప్ప మొయిలీ, కోలార్ స్థానం నుంచి కేహెచ్ మునియప్ప విజయం సాధించారు.
ఈ రెండింటితో పాటు కేంద్ర మాజీ మంత్రి, దివంగత అంబరీష్ గతంలో గెలుపొందిన మండ్య స్థానాన్ని జేడీఎస్ తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడింటినీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ జేడీఎస్ కు ధారాదాత్తం చేయదని చెబుతున్నారు. మండ్యలో సుమలతను బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే స్థానం నుంచి తన కుమారుడు, హీరో జాగ్వార్ ఫేమ్ నిఖిల్, హాసన నుంచి తన సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణను రాజకీయ రంగప్రవేశం చేయించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి భావిస్తున్నారు.దేవేగౌడ చేసిన ప్రతిపాదనలపై రాహుల్ గాంధీ అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. త్వరలోనే సీట్ల సంఖ్యను తేల్చేస్తారని చెబుతున్నారు.