అర్ధరాత్రి కేబినెట్... గవర్నర్ 6 ప్రశ్నలపై గెహ్లాట్ చర్చలు... రసకందాయంలో రాజస్తాన్ సంక్షోభం
రాజస్తాన్ పొలిటికల్ డ్రామా రక్తి కడుతోంది. రోజురోజుకు అనూహ్య మలుపులు తిరుగుతూ చివరకు ఎక్కడ ముగుస్తుందోనన్న ఉత్కంఠను రేపుతోంది. శుక్రవారం(జూలై 23) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలతో రాజ్భవన్కు వెళ్లి అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కోరిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ మిశ్రా నుంచి మాత్రం ప్రతికూల సమాధానమే ఎదురైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు గవర్నర్ ఆరు ప్రశ్నలు సంధించగా... అర్ధరాత్రి గెహ్లాట్ కేబినెట్ను సమావేశపరిచి వాటిపై చర్చించారు.
గెహ్లాట్కు గవర్నర్ ప్రశ్నలు...
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఒకవేళ మెజారిటీ ఉన్నట్లయితే.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన ఎందుకు కోరుతున్నారంటూ గవర్నర్ ప్రశ్నించారు. రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదని,రాజకీయపరమైన ఒత్తిళ్లు పనిచేయవని అన్నారు. 'అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 23న రాజ్భవన్కు లేఖ రాసింది. ఇది చాలా తక్కువ వ్యవధితో కూడిన నోటీసు. దీనిపై రాజ్యాంగ నిపుణులు,న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నాం.' అని గవర్నర్ పేర్కొన్నారు.
ఎజెండా ఏది.. కేబినెట్ ఆమోదం ఏది..
అసెంబ్లీని సమావేశపరచాలని కోరారు తప్పితే... దానికి కేబినెట్ ఆమోదాన్ని జత చేయలేదని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశానికి ఎలాంటి ప్రాతిపదికను నిర్ణయించలేదన్నారు.సాధారణంగా అయితే కనీసం 21 రోజుల వ్యవధితో అసెంబ్లీ సమావేశాలకు నోటీసులు ఇస్తారని గుర్తుచేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏవిధంగా అసెంబ్లీని సమావేశపరచాలో చెప్పాలని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అర్థరాత్రి కేబినెట్ను సమావేశపరిచి గవర్నర్ సంధించిన ప్రశ్నలపై చర్చించారు.
అర్ధరాత్రి తీర్మానం పాస్ చేసిన కేబినెట్
మొదట అసెంబ్లీ సమావేశానికి కేబినెట్లో తీర్మానం పాస్ చేశారు. ఈ తీర్మానాన్ని శనివారం(జూలై 25) ఉదయం గవర్నర్కు పంపించనున్నారు. కరోనా వైరస్,ఆర్థిక సంక్షోభం అంశాలను అసెంబ్లీ సమావేశాలకు ఎజెండాగా నిర్ణయించారు. అంతకుముందు రాజ్భవన్ ఎదుట ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్పై పలు ఆరోపణలు చేశారు. బలపరీక్ష చేపట్టకూడదని గవర్నర్పై పైనుంచి ఒత్తిడి ఉన్నందువల్లే ఆయన అందుకు ఒప్పుకోవట్లేదని ఆరోపించారు. సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Recommended Video
గవర్నర్ నుంచి పిలుపు వస్తుందా...
తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు గెహ్లాట్ లేఖ అందజేశారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రాజ్భవన్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్... ఆర్టికల్ 174కి కట్టుబడి ఉంటానని గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు నిరసన విరమించామని తెలిపింది. ఏదేమైనా అసెంబ్లీని సమావేశపరిచేందుకు కాంగ్రెస్ గట్టిగా పట్టబడుతోంది. శనివారం ఉదయం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్కు పంపించనుండటంతో... ఆయన నుంచి పిలుపు వస్తుందా రాదా అన్నది వేచి చూడాలి.