ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 32 మంది మృతి, పలువురికి గాయాలు..
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్ మందీలో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 32 మంది చనిపోయారు. ఘటనాస్థలానికి 30 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రిని తరలిస్తున్నారు. దాదాపు 50 మందిని సిబ్బంది రక్షించారు.
ప్రమాదం జరిగిన వెంటనే కొందరిని ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 32 మంది చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో కొందరు, హిందురావు ఆస్పత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారు.
ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఉదయం 5.22 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ వచ్చింది. వెంటనే సిబ్బంది వెళ్లారని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం 600 చదరపు అడుగులు గల ప్లాట్లో జరిగిందని డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌదరి పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో బాగా చీకటి ఉందని పేర్కొన్నారు. అయితే అందులో స్కూల్ బ్యాగులు, బాటిళ్లు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయని చెప్పారు.
అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది నిద్రిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. కూలీలు రాత్రి అక్కడే పడుకొన్నారని చెప్పారు. మంటలను పూర్తిగా ఆపివేశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.