తల్లడిల్లుతున్న కేరళ: పెరుగుతున్న మృతుల సంఖ్య: కొట్టుకొస్తోన్న మృతదేహాలు
తిరువనంతపురం: గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు గ్రామాలను నిలువెల్లా ముంచెత్తుతున్నాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. భారీ వరద సంభవించింది. కొడ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం జనావాసాలను ముంచెత్తుతోంది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 18 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు.
వర్ష బీభత్సం..
ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- అయిదు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. వారి అంచనాలకు మించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయక్కడ. పర్వత ప్రాంతాలు, తేయాకు తోటలు అధికంగా ఉండే కొట్టాయం, ఇడుక్కి, పథనంథిట్ట జిల్లాలపై ఈ భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉంటోంది.
రెండేళ్లలో..
అళప్పుజ, ఎర్నాకుళం, త్రిశూర్, మళప్పురం, కొల్లం, పాలక్కాడ్ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 2020 మినహాయిస్తే.. ఇలాంటి భారీ వరదలు సంభవించడం ఇది మూడోసారి. 2018, 2019ల్లోనూ ఇలాంటి వరదలే సంభవించాయి కేరళలో. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో పర్వతాలకు ఆనుకుని ఉన్న కొట్టిక్కళ్, పెరువనంథనం, కొక్కయార్ వంటి గ్రామాల్లో ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. భారీ వర్షాలు, వరదలకు పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగిపడి ధ్వంసం అయ్యాయి.
18 మంది మృతి..
ఆయా ఘటనల్లో ఇప్పటిదాకా 18 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. ఇడుక్కి జిల్లాలోని కంఝార్ గ్రామంలో వరద ప్రవాహానికి కొట్టుకుని వచ్చిన ఓ కారులో రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బురద ప్రవాహం ముంచెత్తడం పలు నివాసాలు మట్టి దిబ్బలుగా మారాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. స్థానిక పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవానాల్లో వారికి అధికారులు ఆశ్రయం కల్పించారు.
రోడ్లు ధ్వంసం..
భారీ వర్షాలు, వరదల ధాటికి ఆయా గ్రామాలకు వెళ్లే మార్గం కూడా లేదు. రోడ్లు కొట్టుకుపోయాయి. ఛిన్నాభిన్నం అయ్యాయి. పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడటంతో పలుచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. వాహనాలు రాకపోకలు సాగించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. పర్వత ప్రాంతాలు, తేయాకు తోటలకు ఆనుకుని ఉండే గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అన్ని చోట్ల కూడా విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఫోన్లు పని చేయట్లేదు.
పోటెత్తిన వరద..
కొట్టాయం జిల్లాలో కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు వరద ప్రవాహంలో చిక్కుకోగా.. స్థానికులు తాళ్లు వేసి, దాన్ని బయటికి లాగారు. ఆ సమయంలో బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వరద ప్రవాహానికి కొట్టుకుని పోయి ఉండేది. పథనంథిట్ట జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. రోడ్ల నిండా వరద ప్రవాహమే కనిపించింది. వాహనాలు కొట్టుకెళ్లాయి.
నిండుకుండల్లా నీటి ప్రాజెక్టులు..
ఇడుక్కి, పథనంథిట్ట, కొట్టాయం జిల్లాల్లో ఉన్న చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి. పథనంథిట్టలోని మణియార్ రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ నెలకొని ఉంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నీటి పారుదల శాఖ అధికారులు ఒకట్రెండు చోట్ల.. హఠాత్తుగా రిజర్వాయర్ల గేట్లను ఎత్తాల్సి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..
సహాయక, పునరావాస చర్యల కోసం కేరళ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. నౌకా దళాధికారుల సహాయాన్ని తీసుకుంటోంది. సదరన్ నేవల్ కమాండ్ నుంచి పెద్ద ఎత్తున బలగాలు వర్ష ప్రభావ ప్రాంతాల్లో మోహరింపజేసినట్లు సహకార శాఖ మంత్రి వీఎన్ వాసన్ తెలిపారు. కొట్టిక్కళ్, పెరువనంథనం, కొక్కయార్ గ్రామాల్లో సహాయక చర్యలను చేపట్టామని వివరించారు. డైవింగ్ అండ్ రెస్క్యూ బృందాలను సన్నద్ధం చేసినట్లు వివరించారు.
ప్రాణనష్టాన్ని తగ్గించేలా..
కొట్టాయం జిల్లాలోనే నాలుగు చోట్ల కొండ చరియలు విరిగిపడినట్లు సమాచారం ఉందని మంత్రి వీఎన్ వాసన్ తెలిపారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా బృందాలన్నీ సహాయక చర్యలను చేపట్టాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు తీసుకుంటున్నామని, ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వీఎన్ వాసన్ స్పష్టం చేశారు.