పీఓకే కాల్పుల్లో 18 మంది ఉగ్రవాదులు హతం..? లాంచ్ ప్యాడ్లు ధ్వంసం: అధికారులు
న్యూఢిల్లీ: అక్టోబర్ 19వ తేదీ, 20వ తేదీల్లో పాకిస్తాన్పై ప్రతీకారచర్యల్లో భాగంగా భారత ఆర్మీ జరిపిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు 16 మంది పాక్ సైనికులు మృతి చెంది ఉంటారని భారత భద్రతాదళ అధికారులు తెలిపారు. నీలం వ్యాలీతో పాటు పీఓకే ప్రాంతంలో మరో మూడు చోట్ల భారత్ ఫిరంగి దాడులు చేసింది. అయితే అధికారులు మాత్రం కచ్చితంగా హతమైన వారి సంఖ్యను చెప్పలేకున్నారు. ఇక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మూడు ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో భారత్ ఎదురుదాడికి దిగింది.
6-10 మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు: ఆర్మీ చీఫ్
లాంచ్ప్యాడ్లను ధ్వంసం చేయండి: రాజ్నాథ్
ఆదివారం రోజున ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారత్ జరిపిన కాల్పులపై రెండు సార్లు బ్రీఫింగ్ ఇచ్చారని రాజ్నాథ్ సింగ్ ఇందుకు అభినందించినట్లు అధికారులు తెలిపారు. టెర్రర్ లాంచ్ప్యాడ్లను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని వాటిని ధ్వంసం చేయాలని రాజ్నాథ్ చెబుతూ అదే సమయంలో పీఓకేలోని నివాసప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజ్నాథ్ సూచించినట్లు అధికారులు తెలిపారు.
Recommended Video
20వ తేదీ తెల్లవారుజామున లాంచ్ప్యాడ్ల ధ్వంసం
పాకిస్తాన్కు చెందిన మందుగుండు సామగ్రి, రేషన్ డిపోలను 155ఎంఎం గన్స్లో మందుగుండు సామగ్రి నింపి ధ్వంసం చేసినట్లు అధికారులు వివరించారు. నీలం వ్యాలీలో నాలుగు లాంచ్ ప్యాడ్లు, జూరా, అథాముఖం, కుండల్షాహి ప్రాంతాల్లో ఉన్న లాంచ్ప్యాడ్లను కూడా అక్టోబర్ 20 తెల్లవారుజామున ధ్వంసం చేశామని చెప్పారు. అంతకుముందు పాక్ కాల్పులకు తెగబడి కర్నా సెక్టార్లో ఇద్దరు భారత జవాన్లను, ఒక పౌరుడిని హతమార్చడంతో భారత్ ఎదురుదాడి చేసింది.
ఉగ్రవాదుల సంగతి భారత్కు ఎలా తెలిసిందన్న షాక్లో పాకిస్తాన్
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి కాల్పులకు తెగబడి అదే సమయంలో ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సహకరించింది.ఇప్పటికే జమ్మూకశ్మీర్లోకి 60 మంది మిలిటెంట్లు చొరబడ్డారని మరో 500 మంది సరిహద్దుల్లో మాటువేసి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉంటే అసలు ఉగ్రవాదులు, వారి ఉగ్రశిబిరాలు కరెక్టుగా ఎక్కడున్నాయో భారత బలగాలకు ఎలా తెలిశాయనే షాక్లో పాకిస్తాన్ ఉన్నట్లు సమాచారం. లాంచ్ప్యాడ్లను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్కు గట్టి సంకేతాలు పంపినట్లయ్యిందని మరోసారి చొరబడేందుకు వణికిపోతారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.