50రోజులు కాదు.. మరో నాలుగు నెలలు ఓపిక పట్టక తప్పదు!
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కడానికి మరో నాలుగు నెలల సమయం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరో యాభై రోజులు ఓపిక పట్టండి.. అంటూ ప్రధాని మోడీ ప్రకటించారు గానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా ఉంటున్నాయన్నారు.
ప్రభుత్వం నోట్లను రద్దు చేసేనాటికి మార్కెట్లో ఉన్న డబ్బు.. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసిన డబ్బును పోల్చి చూసుకుంటే.. ఈ లెక్క స్పష్టమవుతోంది. అక్టోబర్ చివరి నాటికి దేశంలో 17లక్షల 50వేల కోట్ల రూపాయల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి.
ఇందులో 84శాతం నోట్లు రూ.500, రూ.1000 కావడం గమనార్హం. అంటే.. 14లక్షల 50వేల కోట్ల రూపాయలు రద్దయిపోయాయి. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి 13వరకు 50వేల కోట్ల రూపాయలను మాత్రమే బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు పంపిణీ చేయగలిగింది కేంద్రం.
కరెన్సీ అవసరాలు తీరకపోవడంతో.. నిత్యం బ్యాంకుల ఎదుట, ఏటీఎంల ఎదుట జనం గంటల తరబడి బారులు తీరుతున్నారు. దేశ ప్రజల అవసరాలకు సరిపడేంత డబ్బును బ్యాంకులకు చేరవేస్తున్నామని రిజర్వ్ బ్యాంకు చెబుతున్నప్పటికీ.. వాస్తవ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. డిసెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే మొత్తం.. అలాగే డిపాజిట్ చేయకుండా మిగిలిపోయిన నల్లధనం ఎంతనేది తెలియాల్సి ఉంది.
ఈ లెక్కలు తేలితేనే దానికి సమానమైన మొత్తంలో ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 116రోజుల గడువు పడుతుంది. కాబట్టి మరో నాలుగు నెలల దాకా సామాన్యులకు ఈ తిప్పలు తప్పకపోవచ్చు. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40కోట్ల 500రూపాయల నోట్లను ముద్రించాలని మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న కరెన్సీ నోట్ ప్రెస్ కు ఆదేశాలు అందాయి.
దీని ప్రకారం తొలి విడుతలో భాగంగా ముద్రించిన 50లక్షల కొత్త రూ.500 నోట్లు రిజర్వ్ బ్యాంకుకు చేరుకున్నాయి. రెండో విడుతలో మరో 50లక్షల 500 రూపాయలు నోట్లు బుధవారం నాటికి రిజర్వ్ బ్యాంకుకు చేరుతాయి. వీటితో పాటు భారీ సంఖ్యలో ముద్రించిన రూ.20,50,100 నోట్లను కూడా రిజర్వ్ బ్యాంకుకు పంపించనున్నారు