ఎన్ఎల్సీలో భారీ ప్రమాదం: ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు, విశాఖ ఘటన మరుసటి రోజే..
చెన్నై: తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో బుధవారం ఉదయం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరులో ఉన్న నైవేలీ లిగ్నైట్ పవర్ ప్లాంట్ యూనిట్-5లోని బాయిలర్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అగ్నిమాపక దళాలు మంటలన ఆర్పివేశాయి. ప్రమాదంలో గాయపడినవారిని హుటాహుటిన ఎన్ఎల్సీ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మే నెలలో కూడా ఇదే పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నెలరోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.
Recommended Video
మే 7న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన తెల్లారే మే 8న నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో పేలుడు సంభవించింది. తాజాగా, జూన్ 30న విశాఖపట్నంలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై ఒకరు మృతి చెందారు. యాధృశ్చికంగా మరుసటి రోజే అంటే జులై 1న నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లో కూడా ప్రమాదం జరగడం గమనార్హం.