కేరళలో జలప్రళయం: విరిగిపడిన కొండచరియ: మట్టికుప్పల్లో 80మంది: 5 మృతదేహాలు వెలికి
ఇడుక్కి: కొద్దిరోజులుగా కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలు ఉగ్రరూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఉత్తర కేరళలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. కేరళలో కొండవాలు ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి, నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఈ పరిణామాల మధ్య.. కేరళలో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. రెడ్ అలర్ట్ను జారీ చేసింది.
Recommended Video
విద్యార్థుల మధ్య ర్యాట్ రేస్: ఎన్నాళ్లు పాత విధానాలు: సంస్కరణలతో సరికొత్త భారత్: మోడీ
ఏడు జిల్లాలు కకావికలం..
కేరళలోని ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ వంటి జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలోని రాజమాలలో భారీ కొండచరియ విరిగిపడింది. ఈ కొండచరియల మధ్య 80 మంది చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారంతా తేయాకు ఎస్టేట్లో పనిచేసే కార్మికులుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. రాజమాలలో కొండచరియలు విరిగి పడిన సమాచారాన్ని అందుకున్న వెంటనే పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను చేపట్టింది.
రాజమాలలో 80 మంది చిక్కుకున్నట్లు అనుమానాలు..
ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సంఘటనా స్థలానికి పంపించింది. రాజమాలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాయి.ఇప్పటిదాకా అయిదు మృతదేహాలను వెలికి తీశాయి. ఇంకా పలువురు స్థానికులు కొండచరియల మధ్య చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఫలితంగా మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీ, రెవెన్యూ అధికారులు ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇడుక్కి జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటిదాకా 10మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
కుప్పకూలిన పెరియార్ వంతెన
ఎర్నాకుళం జిల్లాలోని నేరియమంగళం గ్రామంలో పెరియార్ నదిపై కట్టిన వంతెన వరద ప్రవాహానికి కుప్పకూలిపోయింది. దీనితో ఈ మార్గంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నది ఉప్పొంగడం వల్ల ఆలువలోని ప్రఖ్యాత శివాలయం నీట మునిగింది. మళప్పురం ప్రాంతంలోని నీలంబుర్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇక్కడ ప్రవహించే చెలియార్ నది ఉప్పొంగింది. సమీప ప్రాంతాలను ముంచెత్తింది. వర్షబీభత్సం మరి కొన్ని గంటల పాటు కొనసాగే ప్రమాదం ఉందంటూ వార్తలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్..
భారత వాతావరణ శాఖ అధికారులు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేశారు. మళప్పురం, ఇడుక్కి, వాయనాడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా.. మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పత్తినంతిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, కోజికోడ్,, కన్నూర్, కాసర్గాడ్ జిల్లాల కోసం ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఆరు నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని అధికారలు పేర్కొన్నారు. వర్ష బీభత్స పరిస్థితులు కొన్ని గంటల పాటు కొనసాగవచ్చని అంచనా వేశారు.