టెక్కీలకు షాక్: 9 నెలల జీతంతో సీనియర్లను తొలగించనున్న కాగ్నిజెంట్
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మెనేజ్ మెంట్ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
న్యూఢిల్లీ: కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మెనేజ్ మెంట్ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకొంటున్న పరిణామాలు సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.అమెరికాలో చోటుచేసుకొన్న మార్పులు కూడ ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.
స్థానికులకే ఉద్యోగావకాలు కల్పిస్తామని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తెచ్చాడు. ఈ ఆర్డర్ ప్రకారంగా స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన అనివార్య పరిస్థితులు ఐటీ కంపెనీలకు నెలకొన్నాయి.
అమెరికాలో ఉంటున్న సుమారు పదివేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఇన్పోసిస్ నిర్ణయం తీసుకొంది.రానున్న రెండేళ్లలో ఈ మేరకు 10 వేల మందిని రిక్రూట్ చేసుకోనుంది ఇన్పోసిస్.
9 నెలల జీతంతో ఇంటికి పంపుతున్న కాగ్నిజెంట్
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సీనియర్ మేనేజ్ మెంట్ స్తాయిలో ఉన్న ఉద్యోగులపై వేటు వేయనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు ఉద్యోగం వదులుకొనేవారికి సుమారు 9 మాసాల జీతం ివ్వనుంది. వలంటరీ సెపరేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాగ్నిజెంట్. డిజిటల్ వైపుకు కంపెనీ అడుగులు వేస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకొంది.
టాప్ లెవల్ ఉద్యోగులను వదిలించుకోనున్న కాగ్నిజెంట్
టాప్ లెవల్ ఉద్యోగులను వదిలించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. స్వఛ్చంధ ఉద్యోగ విరమణ పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాదు రెండవ త్రైమాసిక చివరినాటికి ఈ ప్రక్రియను ముగించాలని భావిస్తోంది.నాస్టాక్ లిస్టెడ్ కంపెనీ ఈ వార్తలను ధృవీకరించింది.డిజిటల్ మార్పులు, అధిక నాణ్యత స్థిరమైన వృధ్దిని సాధించే వ్యూహాంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది కాగ్నిజెంట్.అసిస్టెంట్ డైరెక్టర్ నుండి ఉన్నతస్థాయి అధికారులు, బోర్డు సభ్యులు, వైస్ ప్రెసిడెంట్లు ఇందులో ఉన్నారు.
రూ.40 లక్షల వేతనం తీసుకొనేవారికే ఈ పథకం
ర్యాంక్ ల వారీగా ఉద్యోగులపై వేటు పడనుంది. ఇందులో భాగంగా రిజైన్ చేసిన ఉద్యోగులకు కనీసం 9 మాసాల వేతనం పరిహారంగా చెల్లించనుంది కంపెనీ. దాదాపుగా మూడు నెలల నుండి ఉద్యోగులతో కంపెనీ చర్చలు జరుపుతోంది. కనీసం 40 లక్షల రూపాయాల జీతాన్ని అందుకొనే ఉద్యోగులు ఈ పథకం కిందకు వస్తారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మెరుగైన నిపుణుల ఎంపిక కూడ
కంపెనీని వదిలేయాలనుకొంటున్నవారికి మంచి అనుకూలమైన అవకాశాలను ఇస్తామని కంపెనీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు తన ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి నిపుణులైన ఉద్యోగుల ఎంపిక కూడ కొనసాగుతోందని కంపెనీ ప్రకటించింది.